48 గంటల్లో సంజయ్ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్

48 గంటల్లో సంజయ్ క్షమాపణ చెప్పాలి : కేటీఆర్
  • లేదంటే కోర్టుకీడుస్తా
  • నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హద్దులు దాటి నిరాధార ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మినిమం కామన్ సెన్స్ లేకుండా.. వాస్తవాలు తెలుసుకోకుండా థర్డ్ క్లాస్ ఆరోపణలు చేయడం సంజయ్.. అలవాటుగా మార్చుకున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. 

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌‌కు నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన కూడా లేదని వ్యాఖ్యానించారు. “కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసినంత ఈజీ కాదని బండి సంజయ్ ఇప్పటికైనా గ్రహించాలి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడిన ప్రతిసారి బండి సంజయ్ మరింత దిగజారుతున్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో పెద్ద జోకర్‌‌గా మారిన బండి సంజయ్.. మీడియా హెడ్​లైన్ల కోసం, చీప్ పబ్లిసిటీ కోసం వీధి నాటకాలు ఆడుతున్నారు” అని కేటీఆర్ విమర్శించారు.

 సంజయ్ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా.. నిరూపించాలని సవాల్ విసిరారు. సంజయ్ వెంటనే తన ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు లీగల్ నోటీసులు పంపిస్తున్నానని, 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకీడుస్తానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎంత సున్నితమైనదో, చట్టపరంగా ఎంత కఠినమైనదో తెలియని సంజయ్.. కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తూ, సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.