- రేపు ఉదయం సీల్డ్ కవర్ ద్వారా అభ్యర్థి ప్రకటన
- డిప్యూటీ మేయర్కు పోటాపోటీ
- క్యాంపులోనే మహబూబ్నగర్ కార్పొరేటర్లు, నారాయణపేట కౌన్సిలర్లు
మహబూబ్నగర్, వెలుగు : కొత్తగా ఏర్పాటైన మహబూబ్నగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందోనని పాలమూరు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వెల్లడై రెండు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరి పేర్లను కన్ఫాం చేయలేదు.
ముందుగానే పేర్లు ప్రకటిస్తే కొందరు గోడలు దూకే ప్రయత్నాలు చేస్తారనే అనుమానంతో మేయర్ అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. దీనికితోడు మేయర్ అభ్యర్థి ఎంపిక సీఎం రేవంత్రెడ్డిదేనని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన చెప్పిన వారికే ఈ పీఠాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేయనున్నట్లు సమాచారం. అయితే చైర్ పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా, మొదటి సారి ఎవరూ ఈ కుర్చీలో కూర్చున్నా చరిత్రలో నిలిచిపోనున్నారు.
ఆ ఇద్దరి మధ్యే పోటీ..
మహబూబ్నగర్ కార్పొరేషన్లో 23 స్థానాలు బీసీలకు రిజర్వ్ చేయగా, 30 స్థానాలు జనరల్కు కేటాయించారు. ఈ స్థానాల్లోనూ మెజార్టీ చోట్ల బీసీలు పోటీ చేసి గెలుపొందంగా, గెలిచిన వారిలో చాలా మంది మహిళా కార్పొరేటర్లే ఉన్నారు. దీంతో వారి భర్తలు మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు నుంచి మేయర్ పీఠంపై మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆనంద్ గౌడ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈయన ప్రాతినిథ్యం వహిస్తున్న 49వ డివిజన్ అన్ రిజర్వ్కు కేటాయించడంతో ఆయన సతీమణి ప్రసన్నను ఎన్నికల బరిలోకి దింపాడు.
ఆమెను ఓడించేందుకు సొంత పార్టీలోని కీలక నేతలే ప్రయత్నాలు చేసినా.. వాటిని అధిగమించి తన భార్యను కార్పొరేటర్గా గెలిపించుకున్నాడు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అబ్దుల్ సిరాజ్ ఖాద్రి కూడా తన భార్య కోసం మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నాడు. ఆయన సతీమణి హజీరా బేగం 39వ డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచింది. ఆయనకు కూడా సొంత పార్టీ నేతలు ఓడించేందుకు కుట్రలు చేసినా.. అవి బెడిసికొట్టాయి.
మొత్తానికి ఈ ఇద్దరితో పాటు మరో లీడర్ సైతం ఆయన సమీప బంధువుకు ఈ పీఠాన్ని కట్టబెట్టాలనే పాలి‘ట్రిక్స్’ చేస్తున్నట్లు చర్చ నడుతస్తోంది. దీనికితోడు ముందు నుంచి మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఆనంద్ గౌడ్కు ఈ పీఠం దక్కకుండా చేయాలని మరో లీడర్ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. కాగా డిప్యూటీ మేయర్ పీఠాన్ని మైనార్టీలకు కేటాయించాలనే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
సీల్డ్ కవర్లో పేరు..
మేయర్ పీఠం కోసం సొంత పార్టీలోని లీడర్ల మధ్యే పోటాపోటీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన 29 మంది కార్పొరేటర్లు శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్కు తరలి వెళ్లారు. వీరితో పాటు మరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్కు మద్దతిచ్చి వారి వెంట వెళ్లాడు. అయితే ముందస్తుగా మేయర్ అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తే కార్పొరేటర్లు జంప్అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ ముందస్తుగా భావించింది. దీనికితోడు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో బలాబలాలు మారిపోయే అవకాశం ఉండడంతో మేయర్ పీఠం ‘చేయి’ జారకుండా జాగ్రత్త వహిచినట్లు సమాచారం.
ఈ క్రమంలో మేయర్ ఎవరనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన ఫైనల్ చేసిన పేరును సీల్డ్ కవర్లో భద్రపర్చనున్నారు. ఈ కవర్ను సోమవారం ఉదయం 11 గంటలకు మహబూబ్నగర్ కార్పొరేషన్కు తీసుకొచ్చి, అందరి సమక్షంలో తెరిచి మేయర్ ఎవరనేది ప్రకటించనున్నారు.
