- ఫామ్లు ఇవ్వడానికి శుక్రవారమే లాస్ట్
- అయినా 50 శాతం కూడా ఇవ్వలే
- లీడర్ల ఇండ్లు, పార్టీ ఆఫీసులు, కమ్యూనిటీ హాల్స్ వద్ద పంపిణీ
- బీఎల్వోలు రావడం లేదంటున్న ఓటర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ జిల్లాతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. రెండో తారీఖులోపు ఫామ్స్ పంపిణీ చేయాలని ఎలక్షన్కమిషన్డెడ్ లైన్ పెట్టగా నగరంలో 50 శాతం కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 44 శాతం, రంగారెడ్డిలో 44.6 శాతం మాత్రమే ఫామ్స్ పంపిణీ చేశారు.
చుట్టుపక్కల ఉన్న నల్గొండ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు మాత్రం దూసుకుపోతున్నాయి. ఇక్కడ ఫాంల పంపిణీ 99 శాతం పూర్తయింది హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డిల్లో శుక్రవారం నుంచి నింపిన ఫారాలను సేకరించాల్సి ఉండగా, ఇవ్వడమే పూర్తి కాలేదు. చాలా ప్రాంతాల్లో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. కొంతమంది బీఎల్వోలు లీడర్ల ఇండ్ల వద్ద, పార్టీ ఆఫీసుల వద్ద లేదా కమ్యూనిటీ హాళ్లలోనే కూర్చొని ఫారాలు డిస్ట్రిబ్యూట్చేస్తున్నారని తెలుస్తున్నది. దీంతో చాలామంది అక్కడికి వెళ్లి తెచ్చుకోవడం ఎందుకు లే అని సైలెన్స్గా ఉంటున్నారు. జిల్లాలో 47,36,669 మంది ఓటర్లుండగా,4,062 పోలింగ్ బూత్ లున్నాయి. చాలా తక్కువ కేంద్రాల్లో 90 శాతం వరకు ఫామ్స్ పంపిణీ చేయగా, చాలా చోట్ల 30 నుంచి 40 శాతం కూడా పూర్తి కాలేదు. యాకత్ పురా, చంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు ఫారాలు ఆలస్యంగా వెళ్లడంతో పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది.
ఇండ్లు మారినోళ్లకు ఇవ్వట్లే..
ఇండ్లు మారిన కుటుంబాలు, ఉద్యోగ రీత్యాదూర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందడంలేదు. కుటుంబసభ్యులు కాకుండా ఇతరులకు ఫామ్స్ ఇవ్వడంలేదు. ఎక్కువగా అపార్టుమెంట్లలో ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఒకసారి ఎవరైనా ఇంటికి వెళ్లి డోర్లాక్ఉండడం, టూర్ వెళ్లడం లాంటివి జరిగితే వాళ్ల ఇండ్లకు మళ్లీ వెళ్లడం లేదు. ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఓటర్లను గుర్తించేందుకు బీఎల్వోలకు పెద్ద సవాల్ గా మారింది. ఇక్కడ అంతా లీడర్లే ఫామ్స్ పంపిణీ చేస్తున్నారు.
ఫీల్డ్లోకి ఆర్వీ కర్ణన్...
ఎస్ఐఆర్ ప్రక్రియ స్లోగా కొనసాగుతుండటంతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రెండు రోజులుగా ఫీల్డ్లోనే ఉన్నారు. జోనల్ కమిషనర్లు కూడా గురువారం ఫీల్డ్ లోకి వెళ్లాలని సూచించారు. అలాగే బీఎల్వోలు మరింత వేగవంతంగా ఫామ్స్పంపిణీ చేయాలని ఆదేశించారు. దీంతో చాలా ప్రాంతాల్లో బీఎల్వోలు ఉదయం 7 గంటల కే ఫామ్స్పంపిణీ మొదలుపెట్టారు.
ఫామ్–6 తీసుకోవట్లే...
ఎస్ఐఆర్ లో భాగంగా కొత్తగా ఓటు నమోదే చేసుకునే వారి నుంచి ఫామ్– 6తో పాటు డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. అసలు ఎక్కడా ఫామ్–6 ప్రస్తావనే రావడం లేదు. బీఎల్వోలను అడిగితే ఎస్ఐఆర్ ఫామ్స్ మాత్రమే ఇప్పుడు ఇచ్చి నింపాక తీసుకుంటున్నామని, ఫామ్ –6 ను సంగతి రెండు నెలల తర్వాత చూస్తామని అంటున్నారు.
ఇంగ్లీషు ఫామ్ల ప్రింటింగ్ కోసం..
హైదరాబాద్ జిల్లా పరిధిలో సర్వే ప్రారంభానికి ముందు పొలిటికల్ పార్టీలతో జరిగిన సమావేశంలో ఇంగ్లీషు ఫామ్ లు కూడా కావాలని రిక్వెస్ట్పెట్టారు. నగరంలో నార్త్ ఇండియన్స్ తో పాటు ముస్లింలు ఎక్కువగా ఉన్నారని, ఇంగ్లీష్ లో ఫాంలు ప్రింట్ చేయాలని కోరారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని ఇంగ్లీష్ ఫామ్ల సరఫరా చేశారు. వీటి ప్రింటింగ్ కోసం ఆలస్యం కావడంతో సర్ ప్రక్రియ కూడా ఆలస్యమైంది.
