పంజాబ్ తో మ్యాచ్.. ఢిల్లీకే ఎక్కువ అవ‌కాశాలు..!

పంజాబ్ తో మ్యాచ్.. ఢిల్లీకే ఎక్కువ అవ‌కాశాలు..!

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాంప్‌లో ఐదు కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాల మధ్య ఇవాళ (ఏప్రిల్‌ 20) ఢిల్లీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య వార్‌ జరుగనుంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ పుణేలో జరగాల్సి ఉండింది. అయితే డీసీ క్యాంప్‌లో కోవిడ్‌ కల్లోలం కారణంగా వేదిక ముంబైకి మారింది.

ప్రస్తుత సీజన్‌లో డీసీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, పంజాబ్‌ కింగ్స్‌ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 3 అపజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌లో ఢిల్లీ.. ఆర్సీబీ చేతిలో 16 పరుగుల తేడాతో ఓడగా, పంజాబ్.. సన్‌రైజర్స్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. 

గత రికార్డులను పరిశీలిస్తే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు 28 మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా, డీసీ 13, పంజాబ్‌ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. గత 5 మ్యాచ్‌ల్లో డీసీ ఏకంగా నాలుగింటిలో గెలుపొంది పంజాబ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక, నేటి మ్యాచ్‌కు ఢిల్లీ ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కోవిడ్‌ బారిన పడి ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన మిచెల్‌ మార్ష్‌ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

మరోవైపు పంజాబ్‌.. రెగ్యులర్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ లేకుండానే ఈ మ్యాచ్‌ కూడా ఆడనుంది. మయాంక్‌ స్థానంలో శిఖర్‌ ధవన్‌ పంజాబ్‌ను ముందుండి నడిపించనున్నాడు. పంజాబ్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. బలాబలాల పరంగా పంజాబ్‌తో పోలిస్తే ఢిల్లీ కాస్త బలంగానే కనిపిస్తున్నప్పటికీ, ఆ జట్టులోని ఆటగాళ్లు ఆశించిన మేర రాణించలేకపోతున్నారు. 

పంజాబ్‌ పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. ఢిల్లీ జట్టులో వార్నర్‌, పృథ్వీ షా, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ ఫామ్‌లో ఉండటాన్ని బట్టి చూస్తే, ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్‌ జట్టులో ఒక్క లివింగ్‌స్టోన్‌ మినహా ఎవ్వరూ నిలకడగా రాణించలేకపోతున్నారు. బెయిర్‌స్టో, ధవన్‌ తమ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది.