తరచుగా నడుం నొప్పి వస్తుందా?.. నడుం పక్కభాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా?.. ఆ నొప్పి గజ్జల వరకు ఉన్నట్లు అనిపిస్తుందా?.. మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉన్నాయా.. ?అయితే మీరు తప్పక టెస్టులు చేయించుకుంటే మంచింది. ఎందుకంటే అది సాధారణ నడుం నొప్పి కాకపోవచ్చు.. కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు.. కిడ్నీ రాళ్లు వచ్చినట్టు సంకేతాలేంటీ.. ఎప్పుడు డాక్టర్ ను సంప్రదించాలి.. ఎలాంటి నివారణ జాగ్రత్తలు పాటించాలి.. వంటి అంశాలను తెలుసుకుందాం..
వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో మూత్రంలోని ఖనిజాలు గట్టిపడి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక మాంసాహారం, తక్కువ నీరు తాగడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. గతంలో కిడ్నీ రాళ్లు వచ్చినవారికి లేదా కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి ప్రమాదం మరింత ఎక్కువ అంటున్నారు డాక్టర్లు.
కిడ్నీ రాళ్లను నివారించాలంటే రోజంతా తగినంత నీరు తాగాలి. ఉప్పు, ప్యాకెట్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ను తగ్గించాలి. అవసరమైతే మాత్రమే వైద్యుల సలహాతో కాల్షియం, విటమిన్ సి సప్లిమెంట్లు తీసుకోవాలి. మూత్రం లేత రంగులో ఉండేలా ఎక్కువ నీరు తాగాలని అంటున్నారు
తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం, వాంతులు, మూత్రం తగ్గిపోవడం లేదా మూత్రంలో రక్తం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ముందుగానే గుర్తిస్తే కిడ్నీ రాళ్లను చికిత్సతో సులభంగా నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, తగినంత నీరు తాగడం కిడ్నీ రాళ్ల నివారణకు ఉత్తమ మార్గం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
