దక్షిణదేశం అనే రాజ్యంలో భేరివిరిపురం అనే నగరం ఉండేది. అందులో మణిభద్ర మణిభద్రుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. వ్యాపారంలో బాగా నష్టం రావడంతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సంసారం వెళ్ళదీయలేక ప్రతిరోజూ ఇబ్బంది పడేవాడు. రోజూవారి సరుకులు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు.
అలాంటి సమయంలో.. ఒకరోజు రాత్రి మణిబధ్రుడు నిద్రపోతున్నప్పుడు ఒక వింత కల వచ్చింది. ఒక జైన ముని కలలో కనిపించి.. 'రేపు ఉదయం నీ ఇంటికి వస్తాను. నీవు నన్ను చంపు. అలా చేస్తే నీకు బోలెడంత బంగారం దొరుకుతుంది' అని చెప్పాడు. పొద్దున లేవగానే రాత్రి వచ్చిన కల గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకున్నాడు. తీరాచూస్తే.. ఆ కల నిజమైంది. ఉదయాన్నే వ్యాపారి ఇంటికి జైనముని వచ్చాడు. అతన్ని చంపాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాడు వ్యాపారి. చివరకు 'ఏదయితే.. అదయింది. మునిని చంపేస్తా' అని నిర్ణయించుకున్నాడు.
ముని తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. ఒకే దెబ్బతో ముని చనిపోయాడు. వెంటనే ముని శవం మాయమైంది. ఆ స్థానంలో బంగారు గుట్ట ప్రత్యక్షమైంది.అంతలోనే అక్కడికి ఒక క్షురకుడు వచ్చాడు. జరిగిన సంగతి తెలుసుకున్నాడు. డబ్బు సంపాదనకు ఇంతకు మించిన మార్గం లేదని భావించాడు.
జైన మునులను ఇంటికి తీసుకొచ్చి చంపేయాలనుకున్నాడు. వెంటనే జైన విహారానికి వెళ్ళాడు. అక్కడున్న జైన మునులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తను పరమ భక్తుడనని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. దాంతో ఆ తరువాత రోజు జైన మునులు క్షురకుడి ఇంటికి వచ్చారు. అతడు ఒక పెద్ద కర్రతో వాళ్ల తలలపై కొట్టాడు. వాళ్లలో కొందరు పెడబొబ్బలు పెడుతూ చనిపోయారు. కొందరు గాయాలతో పారిపోయారు. పెద్దగా అరుస్తూ వీధుల్లోకి పరిగెత్తారు.
ఇది చూసిన రాజభటులు ఆ జైన సాధువుల్ని వైద్యుడి దగ్గరకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. క్షురకుడిని బంధించటానికి అతని ఇంటికి వెళ్ళారు. ఇల్లంతా రక్తం.. లోపల కొందరి జైన మునుల శవాలు పడి ఉన్నాయి. రాజభటులు క్షురకుడిని బంధించి ఊరి చావిడి దగ్గరున్న న్యాయాధికారి దగ్గరకు తీసుకెళ్ళారు.ఎందుకిలా చేశావని ప్రశ్నించాడు న్యాయాధికారి. జరిగిన కథంతా చెప్పాడు క్షురకుడు.'ఏ పని చేసినా ఆలోచించి, చెయ్యాలి. ఆలోచన లేకుండా తోచింది చేస్తే ఇలాంటి నష్టమే కలుగుతుంది' అని చెప్పి క్షురకుడికి ఉరిశిక్ష వేశాడు న్యాయాధికారి.
