తనకు పదవుల కంటే.. మాలల హక్కులే ముఖ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రోస్టర్ పాయింట్లను సవరించాలని డిమాండ్ చేస్తూ, ఖైరతాబాద్లోని చింతల బస్తీలో ది నేషనల్ అంబేద్కర్ సేన అధ్యక్షుడు మన్నే శ్రీధర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మంత్రి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. మాలలంతా ఐక్యంగా ఉద్యమించినప్పుడే హక్కులు దక్కుతాయని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రోస్టర్ పాయింట్లు సవరించి, మాలలకు దక్కాల్సిన 5 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు తాను ముందుంటానని భరోసా ఇచ్చారు.
ALSO READ : పోక్సో కేసు నిందితుడి అకృత్యం కేసు
మరోవైపు.. ఎస్సీ గ్రూప్-3లోని మాలలతో పాటు 25 ఉపకులాలకు మొదటి రోస్టర్ పాయింట్ను ప్రస్తుతం ఉన్న 22వ స్థానం నుంచి 16వ స్థానానికి మార్చాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని, ఆ అదనపు 3 శాతాన్ని మాల ఉపకులాలకే కేటాయించాలని కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేషనల్ అంబేద్కర్ సేన నాయకులు హెచ్చరిస్తున్నారు.
