చెన్నై: లెజెండరీ సింగర్ ఎస్.జానకి మృతికి నటుడు, తమిళనాడు సీఎం విజయ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన ప్రత్యేకమైన స్వరంతో ఎన్నో తరాల హృదయాలను గెలుచుకున్న సింగర్ ఎస్. జానకి గారి మరణం అపారమైన దుఃఖాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి పూడ్చలేని లోటని అన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని విజయ్ అన్నారు.
స్టార్ యాక్టర్స్ రజినీకాంత్, కమల్ హాసన్ కూడా సింగర్ ఎస్. జానకి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తన మధురమైన స్వరంతో తరతరాల ప్రజలను ఆనందపరిచిన జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని రజినీకాంత్ ప్రార్థించారు. భౌతికంగా జానకమ్మ మన నుంచి దూరమైన ఆమె పాటలు ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయని కమల్ హాసన్ పేర్కొన్నారు. జానకమ్మ మరణం తనతో పాటు ఎంతోమందికి తీరని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు.
లెజెండరీ సింగర్ జానకి కన్నుమూత:
సినీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నుమూశారు. గతకొంత కాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న ఆమె ప్రస్తుతం మైసూర్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (జులై 11) ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.
జానకి మనువరాలు అప్సర వైద్యుల ఇన్స్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాన కోకిల జానకి మరణంపై పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
