ఖబడ్దార్​ పల్లా రాజేశ్వర్​రెడ్డి..నా కబ్జాలు నిరూపిస్తే ప్రాణత్యాగం చేస్తా

ఖబడ్దార్​ పల్లా రాజేశ్వర్​రెడ్డి..నా కబ్జాలు నిరూపిస్తే ప్రాణత్యాగం చేస్తా
  • ఆడపిల్ల పసుపు, కుంకుమలు గుంజుకున్న నీచపు బతుకు నీది
  • ప్రతిపక్షాలు నా కబ్జాలు నిరూపిస్తే ప్రాణత్యాగం చేస్తా 
  • వేరే పార్టీ నుంచి వస్తే కుక్కలంటావా? 

చేర్యాల, వెలుగు: ఆడపిల్ల పసుపు, కుంకుమలను గుంజుకునే నీచపు బతుకు బతుకుతున్న పల్లా రాజేశ్వర్​రెడ్డికి నియ్యత్​లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డా కామెంట్స్​చేశారు. సోమవారం జనగామ జిల్లా చేర్యాలలోని వీరభద్ర గార్డెన్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో మాట్లాడుతూ స్థానిక నాయకులను ప్రభావితం చేసేందుకు పల్లా డబ్బు సంచులతో వస్తున్నాడని, ఆయనకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు.

 వేరే పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలు, నక్కలతో పోల్చిన పల్లా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. పల్లా అక్క జయప్రదను మోసం చేయడంతో ఆమె డిప్రెషన్​లోకి వెళ్లిందని, ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా సొంత పైసలు పెట్టి భోజనాలు పెట్టి నిన్ను గెలిపించిన. కానీ 70 కోట్లు ఖర్చు పెట్టిన అని చెప్పినవ్..ఖబడ్దార్​పల్లా...నీకు ప్రజలే బుద్ది చెప్తరు’ అని హెచ్చరించారు. 

తాను ఏనాడూ  భూ కబ్జాలకు పాల్పడలేదని, నిరూపిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రతిపక్షాలను సవాల్​విసిరారు. జనగామలో తనకే సీటు వస్తుందని గెలవడం కూడా ఖాయమన్నారు. ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్​, మార్కెట్​ చైర్మన్​ ఎస్​. మల్లేశం గౌడ్​, వైస్​ చైర్మన్​ నిమ్మ రాజీవ్​రెడ్డి, పి. వెంకట్​రెడ్డి, యం. బాలనర్సయ్య, కౌన్సిలర్లు చంటి, నరేందర్​, సతీష్​ గౌడ్​, పి. ఎల్లారెడ్డి, ఎ. మల్లేశం, యం. నాగేశ్వర్​రావు, యం. మల్లేశం, మంద యాదగిరి, నవీన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.