
రాష్ట్రం ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో అధికార పక్షం ప్రతిపక్షాలకు మధ్య యుద్ధానికి రంగం సిద్దమవుతుంటే .. గులాబీ పార్టీలో మాత్రం టికెట్ల లొల్లి షురూ అయింది. ముఖ్యంగా జనగామ బీఆర్ఎస్ లో టికెట్ సమస్య అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి ..వీరిద్దరి మధ్య టికెట్ యుద్దం తారా స్థాయికి చేరింది. బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు.
ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మే 19వ తేదీన జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొండెగంగలు, గుంటనక్కలు, చీడ పురుగులు ఉన్నాయంటూ విమర్శించారు. వాటి కాళ్లు, చేతులు విరిచేస్తానని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఎదుట నీచ రాజకీయాలు సాగవని..కేసీఆరే..తన పనితీరు బాగుందని మెచ్చుకున్నట్లు చెప్పారు. ప్రజల మధ్య తిరిగి, ప్రజా సమస్యలపై పోరాడితేనే ఆదరిస్తారన్నారు. 2014లో, 2018లో తనకు టికెట్ రాకుండా కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు.
టికెట్ నాదే..
జనగామలో తన ప్రత్యర్థులు ఎన్ని కథలు పడ్డా...ఎన్ని కుట్రలు చేసినా జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ తనదేనని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో తనపై పోరాడలేకే కొందరు వైట్ కాలర్ ప్రత్యర్థులు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోశభాష్ ముత్తిరెడ్డి.... బాగా పనిచేస్తున్నావ్..మరింతగా పనిచేయాలి.. టికెట్ నీదే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా ఎలాంటి పనులు చేపట్టినా.. అధికారిక పర్యటనలు చేసినా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పార. అయితే ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించే చేశారని స్థానికంగా చర్చ నడుస్తోంది.
ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గీయుల వార్..
తాజాగా జనగామలో MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య వార్ నెలకొంది. మే 20వ తేదీన జనగామ జిల్లా పరిషత్ కార్యాలయంలో MLC పోచంపల్లి, MLA ముత్తిరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -జడ్పీ చైర్మన్ ముందే రెండు వర్గాలు గొడవ పడ్డాయి.
తన పని తాను చేసుకుంటూ..
ఇదిలా ఉంటే జనగామ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి..సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై పైచెయ్యి సాధించడానికి వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్ ను తమ చేతిలో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రూ. 5 కోట్లతో జీడికల్ దేవస్థానం అభివృద్ధి పనులు చేపట్టారు. కొడ్వటూరు సిద్ధేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధి రూ. 2 కోట్లు కేటాయించారు. జనగామ ప్రజల కోసం లోకల్ ట్రైన్ను పొడిగించాలని..MMTS వేయాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. జనగామ నియోజకవర్గంలో శుభ, అశుభ కార్యాలకు పోచంపల్లి హాజరవుతూ ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఇవన్నీ జనగామ టికెట్ కోసమే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ముత్తిరెడ్డిపై వ్యతిరేకత...
జనగామ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అయితే 2014లో ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో రెండోసారి కూడా గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరితో పాటు బీజేపీలో కొందరు లీడర్లు ఉన్నా... వారు గ్రూప్ రాజకీయాలతో సతమతమవడం ముత్తిరెడ్డికి కలిసి వస్తోంది. అయితే కొన్ని రోజులుగా జనగామలో ఎమ్మెల్యే తీరుపై అటు ప్రజలు, నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఒంటెద్దు పోకడలు, చేష్టలతో జనగామలో తానే యుం అన్నట్లుగా వ్యవహరుస్తున్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డికి ఈ సారి అధిష్టానం టికెట్ నిరాకరిస్తుందని..మంత్రి కేటీఆర్కు సన్నిహితుడైన ఎమ్మెల్సీ పోచంపల్లికి టికెట్ కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది.