గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మొండి చేయి..కౌశిక్ రెడ్డికే బాధ్యతలు

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మొండి చేయి..కౌశిక్ రెడ్డికే బాధ్యతలు

ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి మొండి చేయి చూపింది. ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ పక్కనపెడుతోంది. తాజాగా బీఆర్ఎస్ విద్యార్థి  విభాగం అధ్యక్షుడు, హుజురాబాద్ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు బీఆర్ఎస్ పార్టీ షాకిచ్చింది. హుజురాబాద్ ఇంచార్జ్ పదవి నుంచి తొలగించింది. ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్.. మరోసారి సాధారణ ఎన్నికల్లోను పోటీ చేయాలన్న ఆశలపై నీళ్లు చల్లింది. 

2021 నవంబర్ 3న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 23, 865 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే గెల్లు ఓడిపోయినా కూడా..హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ గా  ప్రజలతో..పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. అయితే ఇటీవలే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను  సీఎం కేసీఆర్  టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. 

గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి..2018లో పోటీ చేసి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. అయితే ఉప ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పాడి కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ పదవిని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది.