
- ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దవూర తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి 12 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, వాటి సంఖ్యను పెంచేందుకు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించానని తెలిపారు.
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు త్రిపుర మండలం లోక్యతండాలో జరిగిన మైసమ్మ తల్లి జాతరకు ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు కర్నాటి లింగారెడ్డి, అబ్బిడి కృష్ణారెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ జయశ్రీ, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.