ఫ్యాకల్టీ, సౌలతులకు కొరత మెడికల్ కాలేజీలు ఎక్కువైనందుకే..

ఫ్యాకల్టీ, సౌలతులకు కొరత మెడికల్ కాలేజీలు ఎక్కువైనందుకే..
  • ఎన్ఎంసీకి రాష్ట్ర హెల్త్ సెక్రటరీ, డీఎంఈ వివరణ 
  • వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ సూచన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లే ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల కల్పనలో సమస్యలు ఏర్పడ్డాయని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాకల్టీ నియామకాలకు అనుమతులు జారీ చేసిందని, ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించిందని ఎన్ఎంసీ అధికారులకు వివరించినట్లు సమాచారం. ఇటీవలే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సమస్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పినట్టు తెలిసింది.

 రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్, ఫ్యాకల్టీ కొరత, ల్యాబుల్లో సౌకర్యాల లేమి వంటి సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఎన్ఎంసీ ఇటీవల ఆదేశించింది. అందులో భాగంగానే హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ శుక్రవారం ఢిల్లీలో సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు ఇచ్చిన వివరణకు ఎన్ఎంసీ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. 

అధికారులకు ఎన్ఎంసీ సూచనలు.. 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సమస్యలు, తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎన్ఎంసీకి వివరించారు. ఈ సందర్భంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ పలు సూచనలు చేసింది. వీలైనంత త్వరగా ఫ్యాకల్టీ నియామకాలు పూర్తి చేయాలని, వసతులను మెరుగుపరచాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే కాలేజీల పర్మిషన్లకు ఇబ్బంది లేదని, సీట్ల కోత ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 26 కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాల కొరత, ఎక్విప్మెంట్ కొరత తదితర సమస్యలను ఎన్ఎంసీ గుర్తించింది.

ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే వారి వివరణలతో ఎన్ఎంసీ సంతృప్తి చెందలేదు. తాము గుర్తించిన లోపాలపై చర్చించేందుకు జూన్ 18న ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈలకు ఎన్ఎంసీ గత శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ ఢిల్లీలో ఎన్ఎంసీ సమావేశంలో పాల్గొన్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న 26 ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు వర్చువల్ గా ఈ సమావేశానికి హాజరయ్యారు.