జనతా కర్ఫ్యూకి ఏడాది

జనతా కర్ఫ్యూకి ఏడాది

ఏడాదికిపైగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతుంది. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా విధించిన జనతా కర్ఫ్యూకి సరిగ్గా ఇవాళ్టితో ఏడాది పూర్తైంది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించడానికి ముందు.. పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సోమవారం నాటితో ఏడాది పూర్తవుతుంది. వైరస్ బారిన పడిన ప్రజలను ప్రాణాలకు తెగించి చికిత్సను అందిస్తున్న డాక్టర్లకు సంఘీభావంగా దేశ ప్రధాని మోడీ గతేగడాది మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ విధించి ప్రజలు మద్దతును కోరారు. 
 
ఆ తర్వాత మార్చి 24 రాత్రి ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా కూడా క్రమక్రమంగా వ్యాప్తి భారీగా పెరగడంతో విడతల వారీగా పొడిగిస్తూ వచ్చారు. ముందుగా 21 రోజుల పాటు కఠిన ఆంక్షలు అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత నాలుగు దశలుగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. మే 31 వరకు దేశం మొత్తం లాక్‌డౌన్‌ లో ఉండగా.. జూన్‌ 1 నుంచి క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వచ్చింది.

సరిగ్గా ఏడాది తిరిగే సరికి దేశవ్యాప్తంగా మరోసారి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా వ్యాప్తి కేసులు మళ్లీ తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఒక దశలో దేశవ్యాప్తంగా 10 వేల కంటే దిగువకు నమోదైన రోజువారీ పాజిటివ్ కేసులు..ఇప్పుడు 40 వేలకు పైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్.. వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లోని ప్రధాన పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.