ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతికే ఉన్నాడు : అమెరికా పోలీసులు

ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతికే ఉన్నాడు : అమెరికా పోలీసులు

గోల్డీ బ్రార్‌ గా పిలుచుకునే సతీందర్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌. ఇతడు పంజాబ్​లోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌ లో 1994లో జన్మించాడు. బ్రార్ తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టైన సూత్రధారి లారెన్స్‌ బిష్ణోయ్‌ తో గోల్డీ బ్రార్​కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్​కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

సింగ‌ర్ సిద్దూ మూసేవాలా హ‌త్య కేసులో మెయిన్ క్రిమినల్ అయిన గోల్డ్ బ్రార్‌ని అమెరికా పోలీసులు హ‌త‌మార్చినట్లు గురువారం సోష‌ల్ మీడియాలో వార్తలు వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ అమెరికా పోలీసులు వివరణ ఇచ్చారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో గోల్డీ బ్రార్ హ‌త్య జ‌రిగిన‌ట్లు ఈరోజు న్యూస్ వైరల్ అయింది. గోల్డీ బ్రార్‌తో పాటు మ‌రో ఇద్దరు వ్యక్తులు సెంట్రల్ ఫోరోజోనాలో జ‌రిగిన కాల్పుల్లో చనిపోయినట్లు అమెరికా వెబ్‌సైట్ త‌న క‌థ‌నంలో రాసింది. దీంతో అందరూ గోల్డీ బ్రార్ చనిపోయాడనే వార్తలు వైరల్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే పోలీసులు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది 37 ఏళ్ల గ్జావియ‌ర్ గ్లాడ్నే అని పోలీసులు స్పష్టం చేశారు.

తాజాగా ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా గోల్డీ బ్రార్​ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్​ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది