ట్రంప్ కామెంట్లపై మోదీ ఎందుకు మాట్లాడట్లే? : రాహుల్ గాంధీ

ట్రంప్ కామెంట్లపై మోదీ ఎందుకు మాట్లాడట్లే? : రాహుల్ గాంధీ
  • పాక్​కు సరెండర్ చేయించినట్లు ట్రంప్ 11 సార్లు చెప్పిండు: రాహుల్
  • అసలైన కులగణన జరిగితే మోదీ ఇంటికే
  • ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతది
  • కుల గణన చేయడం ప్రధానికి ఇష్టమే లేదని విమర్శ
  • బిహార్​లో ‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’కు హాజరు

రాజ్​గిరి(బిహార్​): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోనే పాకిస్తాన్​తో ప్రధాని మోదీ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి పాకిస్తాన్​కు సరెండర్ అవ్వాలని ఆదేశించారని తెలిపారు. ‘నరేందర్.. సరెండర్’ అని ట్రంప్ అనగానే.. మోదీ ‘జీ హుజూర్’ అన్నారని ఎద్దేవా చేశారు. బిహార్ లోని నలందా జిల్లా రాజ్​గిరిలో శుక్రవారం నిర్వహించిన ‘సంవిధాన్ సురక్ష సమ్మేళన్’ ప్రోగ్రామ్​లో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘పాకిస్తాన్​కు సరెండర్ కావాలంటూ నరేంద్ర మోదీని ట్రంప్ ఆదేశించారు. ఈ విషయం స్వయంగా ట్రంప్ 11 సార్లు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించారు. మోదీని బలవంతం చేసినట్లు ట్రంప్ పలుమార్లు బహిరంగంగా చెప్పారు. ఇంత జరుగుతున్నా మన ప్రధాని మోదీ మాత్రం స్పందించలేదు. కనీసం ట్రంప్ చేసిన కామెంట్లను ఖండించలేదు. ట్రంప్ అబద్ధం చెప్పారని కూడా చెప్పలేకపోతున్నారు. దీన్నిబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ట్రంప్ చెప్పింది నిజమే అని చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా మోదీ నోరు విప్పి మాట్లాడాలి’’ అని రాహుల్ డిమాండ్​ చేశారు. తమ అవసరాల మేరకు టైమ్ చూసి మోదీ లొంగిపోతారని ఎద్దేవా చేశారు.

ఆర్ఎస్ఎస్​తో పోరాడుతున్నా

తాను ఆర్ఎస్ఎస్​తో పోరాడుతున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు చాలా తేలికగా లొంగిపోతారు. పోరాడేతత్వం వారిలో లేదు. 2 నిమిషాల్లోనే క్షమాభిక్ష పిటిషన్లు రాసేందుకు రెడీ అయిపోతారు. ఇప్పుడు టెక్నాలజీపరంగా డెవలప్ అయ్యారు. ఒకప్పుడు పెన్ను, పేపర్ అవసరం ఉండేది. కానీ, ఇప్పుడు వాట్సాప్ సరిపోతుంది’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ఇండియాకు బిహార్ క్రైమ్ క్యాపిటల్​గా మారిందని విమర్శించారు. ‘‘బిహార్​లో లా అండ్ ఆర్డర్ అమలు కావడంలేదు. ఒకప్పుడు శాంతి, సామరస్యం, న్యాయానికి ప్రతీకగా ఉన్న  బిహార్.. ఇప్పుడు క్రైమ్ క్యాపిటల్​గా మారింది’’ అని రాహుల్  ఆరోపించారు.

తెలంగాణ కుల గణన మోడల్ బెస్ట్

దేశంలో అసలైన కులగణన ప్రధాని మోదీకి ఇష్టంలేదని రాహుల్ గాంధీ అన్నారు. అసలైన కుల గణన జరిగితే.. మోదీ రాజకీయ జీవితం ముగిసినట్లే అని విమర్శించారు. ‘‘ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా ఓబీసీ అని చెప్పుకుంటారు. జాతీయ జనగణన ప్రకటన తర్వాత మాత్రం దేశంలో అసలు కులాలే లేవని అంటున్నారు. దేశంలో క్యాస్ట్​ లేనప్పుడు మోదీ ఓబీసీ ఎలా అవుతారు? లోక్​సభలో నేను మోదీని కలిశాను. కుల గణన కచ్చితంగా జరుగుతుందని ఆయన ఫేస్ చూసి ఖరాఖండీగా చెప్పాను. కులగణనలో 2 రకాలున్నాయి. అందులో ఒకటి బీజేపీ మోడల్, రెండోది తెలంగాణ మోడల్. ఈ రెండింటికి చాలా తేడా ఉంది.  తెలంగాణ మోడల్ ప్రత్యేకం. అన్ని కుల సంఘాల నేతలతో భేటీ అయ్యింది. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నది. మీడియాను కూడా భాగస్వామిని చేసింది. ప్రజలకు ఎలాంటి ప్రశ్నలు వేయాలో వారినే అడిగి తెలుసుకున్నది. 3 లక్షల మంది సమక్షంలో ప్రశ్నలు ఫైనల్ చేసింది. ఆ తర్వాతే తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టింది. ఇంట్లో ఎవరూ లేకపోతే మళ్లీ మళ్లీ వెళ్లింది. డేటా మొత్తం కలెక్ట్ చేసింది. ఫైనల్​గా సక్సెస్ అయింది. కానీ, బీజేపీ జనగణన మాత్రం దీనికి అపోజిట్. వాళ్లే ప్రశ్నలు తయారు చేస్తారు, వాళ్లే అడుగుతారు, ఇష్టం ఉంటే చెప్పండి, లేదంటే పోండి అనే తత్వం బీజేపీది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.