ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. అకడమిక్ ఇయర్లో 47 రోజులు ఆన్లైన్, మిగిలిన 173 రోజులు ఫిజికల్ క్లాసులని తెలిపింది.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ను మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2021–22 అకడమిక్ ఇయర్ 220 రోజులు ఉంటుందని, ఇందులో 47 రోజులు ఆన్లైన్ క్లాసులు, మిగిలిన 173 రోజులు ఫిజికల్ క్లాసులని తెలిపింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ సోమవారం ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. రెండు టర్మ్ల్లో వర్కింగ్ డేస్ను ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 18 వరకు ఫస్ట్ వర్క్ టర్మ్, డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు సెకండ్ వర్క్ టర్మ్ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 18 వరకూ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయని, ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్స్ ఉంటాయని వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి15 వరకు కొనసాగుతాయన్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయని, మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుంటాయని వివరించారు.
వచ్చే నెల 13 నుంచి 16 వరకు దసరా సెలవులు
కాలేజీలకు అక్టోబర్ 13 నుంచి 16 వరకు దసరా సెలవులుంటాయి. అక్టోబర్ 18న రీ ఓపెన్ అవుతాయి. సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 15 వరకు ఉంటాయి. ఈ అకడమిక్ ఇయర్ చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 13న ఉంటుందని అధికారులు వెల్లడించారు. సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు ఉంటాయని, వచ్చే అకడమిక్ ఇయర్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అకడమిక్ ఇయర్ను ప్రైవేటుతో పాటు అన్ని కాలేజీలు అమలు చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.