- అమ్మేందుకు నాలుగు స్థలాల గుర్తింపు
- దశలవారీగా వేలం వేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్
- సీఎంవో నుంచి ఆర్టీసీకి అందిన ప్రతిపాదనలు?
ఇటీవల ఆర్టీసీ ఆస్తుల వివరాలతో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. అందులో కొన్నింటిని తొలి విడతలో అమ్మేయాలని భావిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో అమ్మేసేందుకు గుర్తించిన ఆస్తులు, భూముల వివరాలు సీఎంవో నుంచి ఆర్టీసీకి చేరినట్లు సమాచారం. ఈ లిస్టులో హైదరాబాద్లోని బస్భవన్ పక్కన వృథాగా ఉన్న ఖాళీ ప్లేస్తోపాటు ముషీరాబాద్ డిపో –1, 2, 3, కూకట్పల్లి డిపో, మియాపూర్ బస్ బాడీ యూనిట్ (బీబీయూ), వరంగల్ బస్టాండ్ జాగ ఉన్నాయి.
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఆస్తులను అమ్మేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. కోకాపేట భూముల లెక్కనే త్వరలో వీటిని ఆన్లైన్లో అర్రాస్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది. దశలవారీగా అమ్మేయాలని చూస్తోంది. తొలి విడతగా సేల్ చేసే ఆస్తులు, భూముల వివరాలను ఆఫీసర్లు రెడీ చేశారు. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 56 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.
ఫస్ట్ ఫేజ్లో రూ.5 వేల కోట్ల టార్గెట్
తొలి విడతలో అమ్మేసే ఆర్టీసీ ఆస్తుల ద్వారా రూ.5 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బస్ భవన్ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్, ముషీరాబాద్ – 1, 2, 3 డిపోలు కలిపి సుమారు 30 ఎకరాల వరకు ఉంటాయి. కూకట్పల్లి డిపో 4 ఎకరాలు, మియాపూర్ బస్ బాడీ యూనిట్ 7 ఎకరాలు, వరంగల్ బస్టాండ్ ఎకరంన్నర దాకా ఉంటాయి. ఈ ఆస్తులను త్వరలోనే ఆన్లైన్లో బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిసింది.
అపవాదు నాకొద్దు.. రెగ్యులర్ ఎండీని పెట్టుకోండి..!
ఆర్టీసీ ఆస్తుల అమ్మకం నేపథ్యంలో తనను తప్పించి కొత్త ఎండీని నియమించుకోవాలని ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ సీఎంను కోరినట్లు తెలిసింది. ఆస్తులు అమ్మే అపవాదు తనకొద్దని, ఇది మచ్చలా మిగిలిపోతుందని తన సన్నిహితుల వద్ద ఆయన అన్నట్లు సమాచారం. ఇప్పటికే సునీల్ శర్మ.. ఆర్ అండ్ బీ, రవాణా, హౌసింగ్ డిపార్ట్మెంట్లకు స్పెషల్ సీఎస్గా కొనసాగుతున్నారు.
మొత్తం ఆస్తులు రూ. 56 వేల కోట్లపైనే
ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ప్రైమ్ ఏరియాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రంలో 97 డిపోలు, 11 రీజియన్లు, 24 డివిజన్లు, రెండు జోనల్ వర్క్షాప్లు, ఒక బస్ బాడీ యూనిట్, రెండు టైర్ రీ ట్రేడింగ్ షాప్స్, ప్రింటింగ్ ప్రెస్, హకీంపేట ట్రాన్స్పోర్ట్ అకాడమీ, స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలు, 14 డిస్పెన్సరీలు, తార్నాక హాస్పిటల్, 364 బస్ స్టేషన్లు, హైదర్గూడ గెస్ట్హౌస్, కల్యాణ మండపం, ఓల్డ్ అడ్మిన్ ఆఫీస్, ముషీరాబాద్ ఓపెన్ ప్లేస్, కాచిగూడ, చిలకలగూడ స్టాఫ్ క్వార్టర్స్, మెట్టుగూడ బంగ్లా తదితర ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఒక్కో జిల్లాలో వంద ఎకరాలకు పైనే భూములున్నాయి. అత్యధికంగా రంగారెడ్డిలో 250 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 194 ఎకరాల ల్యాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆర్టీసీ ఆస్తుల విలువ దాదాపు రూ. 56 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.