
- అవసరమైన చోట తాత్కాలిక వంతెనలు నిర్మించాలి
- ఐటీడీఏ పనితీరు పూర్తిగా మార్చేస్తాం
- ఆఫీసర్లు పద్ధతి మార్చుకోకపోతే ట్రాన్స్ఫరే..
- ఏటూరు నాగారం ఐటీడీఏ రివ్యూ మీటింగ్లో మంత్రి సీతక్క
జయశంకర్ భూపాలపల్లి/ఏటూరునాగారం, వెలుగు : ఏజెన్సీ గ్రామాల్లో వాగులు, వంకలు దాటలేక ప్రాణాలు పోయే పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు చేపడతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క (అనసూయ) అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర, పీవో చిత్రమిశ్ర, డీఎఫ్వో రాహుల్ కిషన్ యాదవ్, ఏఎస్పీ మహేశ్గీతేలతో కలిసి ఐటీడీఏ వైద్య విభాగం, రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్, ఇతర శాఖల ఆఫీసర్లు దీనికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లో రవాణా సౌకర్యం లేక వర్షాకాలం వస్తే వాగులు, వంకలు దాటలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రోగులతో పాటు గర్భిణులు ప్రసవం కోసం దవాఖానలకు చేరుకోవడానికి ఇబ్బందుల పడే వారన్నారు. వాగులు, రోడ్లపైనే ప్రసవాలు జరిగిన రోజులున్నాయన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆఫీసర్లు అవసరమైన చోట తాత్కాలిక ఇనుప వంతెనలు నిర్మించాలన్నారు.
వీటికి కావాల్సిన నిధులను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేస్తుందన్నారు. ఏజెన్సీ వాసులకు పెద్ద దిక్కయిన ఐటీడీఏ పనితీరు పూర్తిగా మార్చి గిరిజనుల విద్యా, వైద్య, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దీనికోస ఆఫీసర్లు సైతం మనస్ఫూర్తిగా పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. గతంలో లెక్క చూద్దాం..చేద్దాం అంటే కుదరదని, పద్ధతులు మార్చుకోవాల్సిందేనన్నారు.
లేకపోతే బదిలీపై వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎవరైనా అధికారులు తప్పు చేసినట్టు తేలితే చర్యలు తప్పవన్నారు. త్వరలో ఐటీడీఏ జనరల్బాడీ మీటింగ్నిర్వహిస్తామని, ఆ లోపు పనితీరు మార్చుకోవాలన్నారు. లేకపోతే ఇంటికి సాగనంపుతామన్నారు. అందుకు సంబంధించిన సంపూర్ణ అధికారం ఐటీడీఏ పీవోకు ఇప్పటి నుంచే కల్పిస్తున్నామన్నారు.