టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ టార్గెట్ 190

టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ టార్గెట్ 190

షార్జా: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. తన ప్రత్యర్థి ఇంగ్లండ్ కు 190 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఓపెనర్ హెడ్రిక్స్ (2)ను ఔట్ చేసి శుభారంభం చేసినట్లు కనిపించినా.. ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేక భారీ మూల్యం చెల్లించుకుంది. సఫారీ బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలింగ్ ను ఎడాపెడా బాదేశారు. రెండో వికెట్ కు డస్సెన్ తో కలసి ఓపెనర్ డికాక్ 71 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 34 పరుగులు చేసి డికాక్ ఔట్ అయిన తర్వాత మారక్రమ్ బరిలోకి దిగి చెలరేగిపోయాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేయగా.. డస్సెన్ కూడా చెలరేగి ఆడడంతో 52 బంతుల్లోనే 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా కేవలం రెండు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 
టార్గెట్ ఛేదన కోసం ఇంగ్లండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, జోస్ బట్లర్ కుదురుకుని ఆడుతూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 12 పరుగులు చేసింది.