మాది ఇన్నోవేటివ్ సర్కార్ : సీఎం రేవంత్

మాది ఇన్నోవేటివ్ సర్కార్ : సీఎం రేవంత్
  • ఉత్తమ పెట్టుబడులకు తెలంగాణే కేంద్రం: సీఎం రేవంత్
  • బడా ఇన్వెస్టర్లతో తెలంగాణ ఆడ బిడ్డలు పోటీపడ్తున్నరు
  • కోటి మంది మహిళలను కోటీశ్వరులం చేస్తం
  • డేటా భద్రంగా ఉంటేనే.. ప్రజలు క్షేమంగా ఉంటరని వ్యాఖ్య
  • గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌‌ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: గూగుల్.. ఇన్నోవేటివ్ కంపెనీ అయితే.. రాష్ట్రంలో ఇన్నోవేటివ్ ప్రభుత్వం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతున్నదని అన్నారు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతోందని తెలిపారు. డిజిటల్‌‌ సమాచారం భద్రంగా ఉంటే.. ప్రజలు క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు. హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌‌ను సీఎం రేవంత్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ‘‘2035 నాటికి 1 ట్రిలియన్‌‌ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారాలి. 

తెలంగాణ రైజింగ్‌‌లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నాం. ఇక్కడి మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారు. ప్రభుత్వంలో కొత్త ఆవిష్కరణలు, విధానాలు తీసుకొచ్చాం. డిజిటల్ ప్రపంచంలో డేటా సేఫ్టీకి మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ ఏర్పాటు చేసిన మొట్ట మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్‌‌లో ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇది ప్రపంచంలోనే ఐదో సెంటర్. గూగుల్ ఆవిర్భావం.. ప్రపంచాన్ని మార్చింది. మన జీవితాలన్నీ డిజిటల్​గా మారాయి’’అని రేవంత్ అన్నారు.

దీర్ఘ కాలిక ప్రణాళికలపై ఫోకస్ చేయాలి

గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌‌.. నైపుణ్య అభివృద్ధిపై కూడా దృష్టి పెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘దేశ సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది. ‘చెడు చేయొద్దు’ అనే గూగుల్ సిద్ధాంతం అంటే నాకెంతో ఇష్టం. గూగుల్​లాగే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి మాత్రమే చేస్తుంది. ఈ విధానంతో కొంత లేట్​గా ప్రయోజనాలు కనిపిస్తాయి. కానీ.. దీర్ఘ కాలికంగా దృష్టిపెట్టి పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు.. ఉత్తమ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రం కోసం గూగుల్​లో అన్వేషిస్తే.. దానికి సమాధానం తెలంగాణే వస్తది. సెర్చ్‌‌లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది. ఇదే.. ‘తెలంగాణ రైజింగ్’’ అని రేవంత్ అన్నారు.

నైపుణ్యాభివృద్ధికి గూగల్ సపోర్ట్ కావాలి

గూగుల్ ఆఫీస్ పక్కన రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘రైతులను సంపన్నులుగా, సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాం. యువతలో నైపుణ్యాలు పెంచి, వారికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షిస్తున్నాం. అందుకు గూగుల్ మద్దతు కావాలి. తెలంగాణ రైజింగ్‌‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. గూగుల్, హైదరాబాద్ పాత స్నేహితులే. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే గూగుల్ తన ఫస్ట్ ఆఫీస్​ను హైదరాబాద్​లో ఓపెన్ చేసింది.

దాదాపు 7వేల మంది గూగుల్ ఉద్యోగులు.. హైదరాబాద్‌‌ను ఇల్లుగా భావిస్తున్నారు’’అని రేవంత్ అన్నారు. విద్య, భద్రత, మ్యాప్‌‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌‌లు, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో గూగుల్‌‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య తమ లక్ష్యమని, దీని కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌‌ తీసుకొస్తున్నామని చెప్పారు.

ఏడాదికి 1.10 లక్షల మంది ఇంజనీర్లు బయటికొస్తున్నరు

రాష్ట్రంలో ప్రతి ఏడాది 1.10 లక్షల మంది ఇంజనీర్లు కాలేజీల నుంచి బయటికి వస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. వీరిలో చాలా మంది స్టూడెంట్లలో నైపుణ్యం కొరవడిందని తెలిపారు. ‘‘విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం. గూగుల్ లాగానే.. మా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని భావిస్తున్నాం’’అని సీఎం రేవంత్ అన్నారు.