
- మార్చి మొదటి వారం నుంచి జీరో కరెంట్ బిల్లులు
- ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ ప్రయోజనం దక్కాలి
- అప్లై చేసుకోనోళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణను కొనసాగించండి
- అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం.. కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు: 200యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్(గృహలక్ష్మి), రూ.500కు గ్యాస్ సిలిండర్ స్కీమ్లను ఈ నెల 27న లేదా 29న ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డి సూచనప్రాయంగా నిర్ణయించారు. వీటి అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
గురువారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినేట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం(మహాలక్ష్మి), ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని, ఇప్పుడు గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.
ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ. 500కు గ్యాస్ సిలిండర్ అందించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలు ఏమిటనే దానిపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా సరే లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
అర్హత కోల్పోయినోళ్లకు సవరణ అవకాశం
అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తెల్లరేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని ఆయన సూచించారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్ల తప్పులు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలని అధికారులకు సూచించారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలన్నారు.
అందుకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా తగినంత ప్రచారం కూడా చేపట్టాలని విద్యుత్తు శాఖకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తప్పులను సవరించుకున్నఅర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. అర్హులందరికీ ఈ పథకంలో లబ్ధి చేకూరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ఆఫీసర్లను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ డీఎస్ చౌహన్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు