- ఇన్నాళ్లూ తాను చట్టబద్ధంగా గ్రానైట్బిజినెస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన మంత్రి
- ఇప్పుడు ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్స్లోనే భారీగా బయటపడ్డ అక్రమాలు
- కరీంనగర్ జిల్లాలో తొమ్మిది క్వారీల నుంచి రూ. 750 కోట్లు వసూలు చేయాలని గనుల శాఖకు ఈడీ ఆదేశాలు
కరీంనగర్, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్కు చెందిన గ్రానైట్ కంపెనీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ. 360 కోట్ల పెనాల్టీ వేసింది. అక్రమంగా గ్రానైట్తవ్వి, తరలించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఇన్నాళ్లూ తాను చట్టబద్ధంగా గ్రానైట్ బిజినెస్ చేస్తున్నానని చెప్పుకొచ్చిన మంత్రి గంగులఇప్పుడు ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. గ్రానైట్తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పలు స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ఏపీ, తమిళనాడులోని వివిధ పోర్టుల్లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసి, గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిగ్గుతేల్చింది. కరీంనగర్ జిల్లాలో గనులశాఖ ఇచ్చిన అనుమతులకు మించి గ్రానైట్ను తవ్వి, తరలించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 124.94 కోట్ల సీనరేజీ ఎగబెట్టిన తొమ్మిది గ్రానైట్ ఏజెన్సీలకు బుధవారం నోటీసులు ఇచ్చింది. ఈ సీనరేజీతో పాటు దానికి ఐదు రెట్లు కలిపి రూ.749.66 కోట్ల ఫైన్ వేసింది. ఇందులో మంత్రి గంగుల కమలాకర్కు చెందిన శ్వేత గ్రానైట్కే ఏకంగా రూ. 360 కోట్ల పెనాల్టీ వేయడం అధికార పార్టీ టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. అక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్కు చెందిన శ్వేత గ్రానైట్స్ ముందు వరుసలో ఉంది. గ్రానైట్ ఏజెన్సీలకు నోటీసులు జారీచేయడంతో పాటు అక్రమ మైనింగ్కు పాల్పడ్డ ఏజెన్సీల నుంచి సీనరేజీతో పాటు పెనాల్టీ వసూలు చేయాలని గనుల శాఖను ఈడీ ఆదేశించింది.
రూ. 124.94 కోట్ల సీనరేజీ ఎగవేత
కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ ఫ్యామిలీకి చెందిన శ్వేత గ్రానైట్స్తోపాటు మరో 8 గ్రానైట్ కంపెనీలు 2008 నుంచి 2011 వరకు అక్రమ మైనింగ్కు పాల్పడ్డాయి. గనుల శాఖ నుంచి పర్మిషన్ పొందిన దానికంటే ఎక్కువ గ్రానైట్ను విదేశాలకు ఎగుమతి చేశాయి. దీంతో ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో రూ. 124.94 కోట్ల దాకా ఎగవేశాయి. ఈ విషయంపై అప్పట్లో ఫిర్యాదులు వెళ్లినా నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 2019లో పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్కే చెందిన వైఎస్సార్ సీపీ నేత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి , లాయర్ భేతి మహేందర్ తదితరులు ఈడీ, సీబీఐకి కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో ఆయా కంపెనీలు ఎంత పరిమాణంలో గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేశారో వివరాలు తీసుకున్న ఈడీ ఆఫీసర్లు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్ పోర్టుల వద్ద ఉన్న రికార్డులతో పోల్చి చూశారు. ఈ సందర్భంగా గ్రానైట్ కంపెనీలు చెప్పిన లెక్కలకు, ఫీల్డ్ లెవల్లో ఉన్న లెక్కలకు భారీ తేడా ఉండడంతో అక్రమాలు జరిగినట్లు తేల్చారు.