వాషింగ్ మెషిన్లలో రూ.500 నోట్లు కట్టలు.. వైజాగ్ నుంచి అక్రమంగా తరలింపు

వాషింగ్ మెషిన్లలో రూ.500 నోట్లు కట్టలు.. వైజాగ్ నుంచి అక్రమంగా తరలింపు

ఎన్నికల నగారా మోగిన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి తరలిస్తున్న సొమ్ము భారీగా పట్టుబడటం గమనార్హం. ఆ మధ్య కర్నాటకలో లారీల్లో తరలిస్తున్న సొమ్ముని సీజ్ చేశారు అధికారులు, ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి వ్యవహారమే బయటపడింది. విశాఖలో డబ్బుని వాషింగ్ మెషిన్లలో పెట్టి తరలించడం కొసమెరుపు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వాషింగ్ మెషిన్లలో దాచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 1.30 కోట్ల రూపాయలు, 30 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. 

 ఎవ్వరికీ అనుమానం రాకుండా.. హవాలా సొమ్ము తరలించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. విశాఖలో నోట్ల కట్టలను ఎవరికీ అనుమానం రాకుండా వాషింగ్ మెషిన్లలో పెట్టారు. వాటిని ఆటోలో తరలిస్తున్నారు. దసరా సీజన్లో ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో వాషింగ్ మెషిన్లు తరలిస్తున్న ఆటోపై ఎవరికీ అనుమానం రాలేదు. కానీ పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. ఎన్ఏడీ జంక్షన్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.  అయితే ఈ నగదు  ఈ నగదు దసరా సేల్స్ కు  సంబంధించినదని ఓ వ్యాపారి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

 తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పెద్ద మొత్తంలో నగదు, నగలు, ఇతర బహుమతులు పట్టుబడుతున్నాయి. కర్నాటక నుంచి తరలించే సొమ్ముపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు పోలీసులు. ఏపీ సరిహద్దుల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ దశలో విశాఖలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం విశేషం. ఈ సొమ్ముకి, తెలంగాణ ఎన్నికలకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దొంగ సొమ్ము కాకపోతే వాషింగ్ మెషిన్లలో ఎందుకు తరలిస్తారని అంటున్నారు

విశాఖలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఓ ఆటోని ఆపి తనిఖీలుచేశారు. డ్రైవర్ ను ప్రశ్నించగా విజయవాడకు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కిరాయికి తీసుకెళుతున్నానని చెప్పాడు. కానీ పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా ప్యాక్ చేసిన ఉన్న ఆరు  వాషింగ్ మిషన్ లో రూ.కోటీ30 లక్షలు క్యాష్, 30 సెల్ ఫోన్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ నగదు ఎవరిది..? ఎవరు కిరాయికి మాట్లాడారు..? విజయవాడలో ఎక్కడికి డెలివరీ ఇవ్వటానికి తీసుకెళుతున్నావు..? అంటూ ఆటో డ్రైవర్ ను పోలీసులు ప్రశ్నించగా సరైన సమాధానలు చెప్పలేదు. దీంతో ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఒకేసారి పెద్దమొత్తంలో ఆటోలో డబ్బు తరలించడాన్ని చూసిన పోలీసులు కూడా షాక్‌ తిన్నారు. అయితే.. పట్టుబడ్డ నగదు మొత్తం హవాలాకు సంబంధించినదని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  నిందితుడి వద్ద ఆ నగదుకి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని.. అందుకే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఎవరి ఆదేశాలతో నగదును తరలిస్తున్నాడనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 30 సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి సీఆర్పీసీ 41, 102 సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.