జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న10 లారీలను మైనింగ్ ఆఫీసర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్టీపీపీలో కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం టెండర్లు పూర్తి కాగా, పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులను బీహెచ్ఎల్ సంస్థ చేపడుతుండగా, పవర్ మేక్ కేపీసీ సంస్థలు సబ్ కాంట్రాక్ట్ గా ఉన్నాయి. కేపీసీ సంస్థ వేలాల, చెన్నూర్, భూపాలపల్లి జిల్లాలోని పలు క్వారీల నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు.
బుధవారం చెన్నూర్ నుంచి 10 ఇసుక లారీలు లోడ్తో ఎన్టీపీసీకి చేరుకోగా, వే బిల్స్ లో అడ్రస్ తేడా ఉండడంతో గేట్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. సాయంత్రం వరకు లారీలు అక్కడే నిలిచిపోగా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న మైనింగ్, పోలీస్ అధికారులు ఇసుక లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ విషయంపై ఎస్సై రాజ శేఖర్ ను వివరణ కోరగా, 10 ఇసుక లారీలు దొరికిన విషయం వాస్తవమేనని, మైనింగ్ అధికారులతో కలిసి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు.
