
న్యూఢిల్లీ: గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నాం విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.
ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను భట్టి చూస్తే విమానంలో ఎవరూ బతికే ఛాన్స్ లేనట్లే తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గుజరాత్ విమాన ప్రమాదం భారత్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా చరిత్రలో నిల్చిపోనుంది. గుజరాత్ విమాన ప్రమాద నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలు గురించి చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు భారత్లో జరిగిన 10 ఘోర విమాన ప్రమాదాల గురించి తెలుసుకుందాం.
Also Read : విమాన ప్రమాదంతో రంగంలోకి ఇండియన్ రైల్వే
నవంబర్ 12, 1996, చార్ఖీ దాద్రి జంక్షన్: చర్ఖీ దాద్రీ విమాన ప్రమాదం భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదం. 1996, నవంబర్ 12న సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 విమానం ఢిల్లీ సమీపంలో గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ ఇల్ విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.
జూలై 17, 2000, పాట్నా ఎయిర్ క్రాష్: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారు. పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఏప్రిల్ 26, 1993, ఔరంగాబాద్ విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491, బోయింగ్ 737, ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి, ఒక ట్రక్కు, విద్యుత్ తీగలను ఢీకొట్టాయి. ఈ విషాద ఘటనలో 55 మంది మృతి చెందారు.
ఆగస్టు 16, 1991, ఇంఫాల్ విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 69 మంది చనిపోయారు.
ఫిబ్రవరి 14, 1990, బెంగళూరు విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605, ఎయిర్బస్ A320 బెంగళూరుకు చేరువలో కూలిపోయింది. ఈ ఘటనలో 92 మంది మరణించారు.
అక్టోబర్ 19, 1988, అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది. మొత్తం 133 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
జూన్ 21, 1982, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కుప్పకూలింది. దీంతో 17 మంది మరణించారు.
జనవరి 1, 1978, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 213 మంది జలసమాధి అయ్యారు.