విమాన ప్రమాదంతో రంగంలోకి ఇండియన్ రైల్వే.. అహ్మదాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్

విమాన ప్రమాదంతో రంగంలోకి ఇండియన్ రైల్వే.. అహ్మదాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్

గుజరాత్ అహ్మదాబాద్ లో మధ్యాహ్నం జరిగిన ప్రమాదం దేశం మెుత్తాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం 242 మందితో ప్రయాణిస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తిరిగి ప్రకటన చేసే వరకు ఎయిర్ పోర్టును సైతం మూసివేస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే విమానాశ్రయం సమీపంలోనే జరిగిన ప్రమాదం వల్ల సామాన్య ప్రజలు, విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున భారతీయ రైల్వే సంస్థ రంగంలోకి దిగింది. 

ప్రమాదం జరిగిన అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ఇతర ప్రాంతాలకు నడపనున్నట్లు వెల్లడించింది. విమాన సేవలు తాత్కాలికంగా రద్దు కావటంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇది కొంత ఉపశమనాన్ని అందిస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది. రాత్రి 12 గంటలకు అహ్మదాబాద్ నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఒకటి దిల్లీకి, మరొకటి ముంబైకి నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లలో ఏసీ 3 టైర్ కోచ్ లు ఉంటాయని వెల్లడించింది. ఈ సౌకర్యం విమాన సేవల్లో అంతరాయం వల్ల ఇబ్బంది పడే ప్రజలకు, అలాగే ఇతర నగరాల నుంచి తమ ప్రయాణాలను కొనసాగించటానికి దోహదపడనుంది. 

Also Read : ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి 'Mayday Call'.. అసలేంటిది..?

ప్రస్తుతం అహ్మదాబాద్ విమానాశ్రయం లోపలికి గానీ లేదా విమానాశ్రయం నుంచి బయటికి కానీ ఎలాంటి విమానాల రాకపోకలు లేవు. అయితే వీటిని తిరిగి ఎప్పుడు మెుదలుపెడతారనే అంశంపై ప్రస్తుతం స్పష్టత లేకపోవటంతో ఇప్పటికే విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులను కొంత మేర తగ్గించటానికి రైల్వే నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ సహాయం చేయనున్నాయి. ఒక విధంగా ఇవి ఇతర నగరాల్లో విమానాశ్రయాల నుంచి తమ డెస్టినేషన్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకునేవారికి హెల్ప్ అవుతుంది. 

ప్రస్తుతం అహ్మదాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను సైతం అధికారులు ఇతర ఎయిర్ పోర్టులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల రైల్వేలు నడపనున్న స్పెషన్ ట్రైన్స్ రద్దీని కూడా తగ్గించటానికి దోహదపడనుంది.