ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్‎గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి

రాయ్‎పూర్: ఛత్తీస్‌గఢ్‌‎‎లో మరోసారి తుపాకుల మోత మోగింది. బుధవారం (డిసెంబర్ 3) బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్‎లో 12 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)లోని ముగ్గురు జవాన్లు అమరులయ్యారని వెల్లడించారు. 

మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటన స్థలంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.

కాగా,2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​కగార్‌‌‌‌‌‌‌‌తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్నది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది. 

దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన అగ్రనేతల్లో నంబాల కేశవరావును ఇప్పటికే ఎన్‌‌‌‌కౌంటర్​చేసిన భద్రతా బలగాలు.. ఇటీవల మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ మడవి హిడ్మాను ఎన్‌‌‌‌కౌంటర్ చేశాయి. మరోవైపు మల్లోజుల వేణుగోపాల్​, ఆశన్న లాంటి సీనియర్​లీడర్లు లొంగిపోయారు.

మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్​దేవ్‌‌‌‌జీ సైతం పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతరంగా దండకారణ్యంలో జనతా సర్కార్ నడిపిన మావోయిస్ట్ పార్టీ వరుస ఎదురుదెబ్బలతో కకవికాలం అవుతోంది. భద్రతా దళాల దూకుడుతో మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది.