
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాది13 వేల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 7,700 ల మరణాలు నమోదయ్యాయి. రోడ్లపై ప్రయాణించేవారికి మధ్యాహ్నం, సాయంత్రం వేళలు ప్రమాదకరంగా మారాయి. జనవరి 1 నుంచి మే 20 వరకు ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఉత్తరప్రదేశ్ రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ సెల్ ఓ రిపోర్టును ప్రచురించింది. యూపీలో 2024లో 46,052 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 24,118 మంది ప్రాణాలు కోల్పోయారు.
మధ్యాహ్న వేళల్లోనే ఎక్కువ..
రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం కంటే ఎక్కువగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల సమయాల్లో జరిగాయి. మధ్యాహ్నసమయమే అత్యంత ప్రమాదకరమైనదిగా నిలిచింది. ఇందులో 4,352 ప్రమాదాలు చోటు చేసుకోగా, 2,238 మరణాలు నమోదయ్యాయి. తీవ్రమైన వేడి, డ్రైవర్ అలసిపోవడం, అధిక వేగం వల్లే ఎక్కువశాతం ప్రమాదాలు జరిగాయని రిపోర్టు పేర్కొంది. సాయంత్రం సమయంలో 3,254 ప్రమాదాలు చోటు చేసుకోగా1,945 మరణాలు నమోదయ్యాయి. వీటికి ట్రాఫిక్ రద్దీ, తగ్గిన విజిబిలిటీ కారణాలని వెల్లడించింది.