విదేశాల్లో మెడిసిన్ చదివిన స్టూడెంట్లు ఎఫ్ఎంజీఈలో ఫెయిల్
మారిషస్, నేపాల్, బంగ్లాదేశ్లో చదివినోళ్లే మెరుగు
ఎంబీబీఎస్.. మన దగ్గర ఆ సీటు రావాలంటే నీట్ కొట్టాల్సిందే. అది కూడా సర్కారీ కాలేజీల్లో వస్తేనే జేబుకు కొంచెం సేఫ్. ప్రైవేటులో వచ్చినా, మేనేజ్మెంట్ సీటు కొనాలన్నా లక్షలు విదిలించాల్సిందే. చాలా మందికి ఆ స్థోమత ఉండదు. అందుకే తక్కువ ఖర్చుతో మెడిసిన్ సీట్లిచ్చే దేశాల బాట పడుతున్నారు మనోళ్లు. చదువు పూర్తి చేస్తున్నారు. కానీ, ఇక్కడకు వచ్చే సరికి ఫెయిలైపోతున్నారు. అవును, విదేశాల్లో డాక్టర్ చదివినోళ్లు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)ని కచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అందులో పాసవ్వాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువంతా సాఫీగా సాగినా, ఎఫ్ఎంఈజీ దగ్గరకు వచ్చేసరికి మనోళ్లు డీలా పడిపోతున్నారు. ఆ టెస్టును పాసవ్వలేకపోతున్నారు. ఈ ఏడాది కేవలం 14.2% మంది మాత్రమే ఆ టెస్టులో పాసయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ఎంజీఈని నిర్వహించే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించిన వివరాలివి.
8,764 మందే…
2015 నుంచి 2018 మధ్య వివిధ దేశాల్లో 61,708 మంది మెడిసిన్ చదివారు. అందులో ఎఫ్ఎంజీఈలో గట్టెక్కింది కేవలం 8,764 మంది. అంటే కేవలం 14.2%. చైనా, రష్యా, ఉక్రెయిన్ల నుంచి మెడిసిన్ పట్టా పొందినోళ్లలోనే ఎక్కువ మంది పరీక్షను పాసవ్వలేకపోతున్నారు. మొత్తం స్టూడెంట్లలో 54,055 (87.6%) మంది చైనా, రష్యా, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, నేపాల్, కిర్గిస్థాన్, కజకిస్థాన్లలోనే చదువుతున్నారు. మారిషస్లో చదివిన 154 మంది స్టూడెంట్లలో 81 మంది (52%) టెస్టు పాసయ్యారు. 1,265 మంది స్టూడెంట్లకు గానూ 343 మందితో బంగ్లాదేశ్లో చదివిన వాళ్లు రెండో స్థానంలో నిలిచారు. నేపాల్లో చదివిన 5,894 మంది స్టూడెంట్లలో 1,042 (17.68%) మంది ఎగ్జామ్ పాసయ్యారు. ఎక్కువ మంది స్టూడెంట్లలో 20,314 మందితో చైనా టాప్లో ఉంది. అయితే, ఆ మొత్తం విద్యార్థుల్లో ఎఫ్ఎంజీఈని క్లియర్ చేసింది కేవలం 2,370 మంది. అంటే 11.67%.
రష్యాలో చదివిన వాళ్లలో 12.89 %, ఉక్రెయిన్లో మెడిసిన్ పూర్తి చేసినోళ్లలో 15% మంది పాసయ్యారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే స్టూడెంట్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేలా ఈ ఫలితాలను జనానికి అందుబాటులో ఉంచామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో 77 వేల ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే, వాటిని లక్ష సీట్లకు పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు వినోద్ పాల్ తెలిపారు. షనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎంబీబీఎస్ చదివినోళ్లైనా లైసెన్సు కోసం ఓ టెస్టు రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదివిన వారికి ఎఫ్ఎంజీఈ యథావిధిగా ఉంటుంది. ఎన్ఎంసీ అమల్లోకి రావడానికి మరో మూడేళ్లయినా పట్టే అవకాశం ఉంది.