హైదరాబాద్లో ఫేక్ హైడ్రా అధికారులు.. నార్సింగిలో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్లో ఫేక్ హైడ్రా అధికారులు.. నార్సింగిలో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్లో చెరువులు ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. హైడ్రా ఏర్పాటైనప్పటినుంచి నగర వ్యాప్తంగా అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసింది. చెరువుల ఆక్రమణల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది..అయితే కొందరు హైడ్రా పేరుతో మోసాలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నార్సింగిలో హైడ్రా పేరుతో కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్​ విపత్తు నిర్వహణ, ఆస్తి రక్షణ సంస్థ(HYDRAA) అధికారులమని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్​ 23న మధ్యాహ్నం 3.20గంటలకు గండిపేట మండలం నెక్నాంపూర్​ లోని అల్కాపూర్​ టౌన్​ షిప్​పరిధిలోని  ఓ ఇంటి ఓనర్​ ని హైడ్రా అధికారులమని ఇద్దరు వ్యక్తులు బెదిరించారు. ఇద్దరు నిందితులు బ్లాక్​ కలర్​ వాహనంలో ఆ ఇంటికి వచ్చి ప్రశ్నించడం, ఇంటి ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. 

ఇద్దరు వ్యక్తులను ఇంటి సహాయకుడు అడ్డుకోగా హైడ్రా అధికారులుగా చెప్పుకొని ఇంటిని కూల్చివేస్తామని బెదిరించారు. ఇంటి యజమానితో మాట్లాడమని చెప్పిన వినకుండా బెదిరింపులకు పాల్పడినట్లు  ఇంటిసహాయకుడు  గుంతకల్ మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

నిందితులను అల్కాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన కారు డ్రైవర్, కరీంనగర్ జిల్లా నివాసి మిరియాల వేదాంతం (22) ,మణికొండలోని పుప్పాలగూడలోని ఎస్టీమ్ రెసిడెన్సీలో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్టీసీ సిబ్బంది యెలిశెట్టి శోభన్ బాబుగా గుర్తించారు. వీరిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులు అదుపులో తీసుకున్నారు. 

ఈ ఘటనపై స్పందించిన హైడ్రా గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. హైడ్రాపేరులో ఏవైనా బెదిరింపులు, మోసాలకు పాల్పడితే అడ్డుకోవాలని హెచ్చరించింది. అటువంటి సంఘటనలను వెంటనే పోలీసులకు నివేదించాలని లేదా నేరుగా HYDRAAకి రిపోర్డు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

అటువంటి అధికారిక దర్యాప్తులన్నీ సిబ్బంది ఉద్దేశం బహిర్గతం చేస్తూ బహిరంగంగా నిర్వహించబడుతున్నాయని ఏజెన్సీ వివరించింది. HYDRAA పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు తేలితే ఏ ఉద్యోగి అయినా క్రమశిక్షణా చర్యలు తప్పవని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో 8712406899 కు వాట్సాప్ ద్వారా నివేదించాలని ,వీలైతే సంబంధిత వ్యక్తి ఫోటోలను జతచేయాలని ప్రజలకు సూచించింది.