నోయిడాలో మళ్లీ హాస్పిటల్లో చేరిన ఇద్దరు పేషెంట్లు
నోయిడా: కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు కరోనా పేషెంట్లకు మళ్లీ కరోనా వచ్చింది. గత శుక్రవారం వీరికి టెస్టులు చేయగా వైరస్ నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ మళ్లీ మూడోసారి టెస్టుల్లో పాజిటివ్ రావడంతో మళ్లీ రీ అడ్మిట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్బుద్ధనగర్కు చెందిన ఇద్దరికి నోయిడాలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. 24 గంటల వ్యవధిలో వీరి నమూనాలు పరీక్షించగా నెగెటివ్ వచ్చింది. దీంతో మూడోసారి టెస్టులు చేయగా వారికి పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ను అధికారులు కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇలా నెగెటివ్ వచ్చిన తర్వాత మళ్లీ పాజిటివ్ రావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా హాట్ స్పాట్గా ఉన్న గౌతమ్బుద్ధనగర్లో యూపీలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 15 వరకూ హాట్ స్పాట్లు ఉన్న ప్రాంతాలను పూర్తిగా సీల్ చేసేశారు. ఈ నెలాఖరు వరకూ జనం ఎక్కడా గుమిగూడకుండా నిషేధం విధించారు.