ఎల్బీనగర్, వెలుగు: రాబోయే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 2002 నాటి తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్ ఓటర్ వివరాలు దొరక్కపోయినా ‘సర్’ ఫారం సమర్పించవచ్చని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో తెలిపారు. వివరాలు లేవనే కారణంతో ఫారం సమర్పించడంలో ఆలస్యం చేయవద్దని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. అలాంటి వారు ఫారంలోని పార్ట్-–3లో ప్రస్తుత వివరాలను మాత్రమే నమోదు చేసి, సంబంధిత బీఎల్వోలకు అందజేస్తే సరిపోతుందన్నారు.
2002 వివరాలు అందుబాటులో ఉంటే నమోదు చేయాలని, లేకపోతే ఖాళీగా వదిలేయవచ్చని పేర్కొన్నారు. వివరాలు ఇవ్వని వారికి ఆగస్టులో ఎన్నికల కమిషన్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత కమిషన్ సూచించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. అర్హులైన ఓటర్లందరూ త్వరగా ఫారాలను అందజేసి సహకరించాలని కోరారు.
