పట్టాలి పతకం.. కొట్టాలి కప్పు!
ఒలింపిక్స్, టీ20 వరల్డ్కప్పై అందరి దృష్టి
ఇండియా క్రీడారంగానికి 2019 మిశ్రమ ఫలితాలనిచ్చింది. వన్డే వరల్డ్కప్ చేజారినా.. వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్లింది. పీవీ సింధు విశ్వకిరీటాన్ని సొంతం చేసుకున్నా.. బ్యాడ్మింటన్ కాస్త భారంగా సాగింది. అథ్లెటిక్స్, టెన్నిస్లో నిరాశ ఎదురైనా… ఆర్చర్లు, షూటర్ల గురి, రెజ్లర్ల ‘పట్టు’దల.. బాక్సర్ల పంచ్ పవర్ అభిమానులను అలరించాయి..! 2020లో ఆ ఊపు రెట్టింపు కానుంది..! ఎందుకంటే ఇది ఒలింపిక్ సంవత్సరం..! ప్రతి క్రీడాకారుడి జీవితకాల లక్ష్యం.. అభిమానులకు చిరకాల జ్ఞాపకంగా మిగిలే విశ్వక్రీడలకు ఈ సారి జపాన్ ఆతిథ్యం ఇవ్వనుంది..! రియో ఒలింపిక్స్లో రెండు పతకాలకే పరిమితమైన ఇండియా టోక్యో కోసం పక్కాగా ప్రిపేర్ అవుతోంది..! గతేడాది వన్డే ప్రపంచకప్ మజాను ఆస్వాదించిన ఫ్యాన్స్ కోసం ఈ సారి వరల్డ్ టీ20 సహా మూడు వరల్డ్ కప్స్ రెడీగా ఉన్నాయి..! అనేక ఆశలతో ఈ క్రీడానామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఇండియా నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నదేమిటో చూద్దాం..!
మూడు కప్పులాట..!
అండర్-19 వరల్డ్ కప్
జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9, వేదిక: సౌతాఫ్రికా
మహిళల టీ20 వరల్డ్కప్
ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వేదిక:ఆస్ట్రేలియా
పురుషుల టీ20 వరల్డ్ కప్
అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వేదిక: ఆస్ట్రేలియా
ఈ ఏడాది ఏకంగా మూడు వరల్డ్ కప్లు క్రికెట్ ఫ్యాన్స్కు కావాల్సిన కిక్ ఇవ్వనున్నాయి. అండర్–19 వరల్డ్కప్తో పాటు మహిళల, పురుషుల టీ20 వరల్డ్కప్లు జరగనున్నాయి. సౌతాఫ్రికాలో ఈ నెల 17 నుంచి జరిగే అండర్–19 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఇప్పటికే అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన మన జట్టు ఐదో కప్పుపై కన్నేసింది. ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలోని జట్టు యశస్వి జైస్వాల్, ఠాకూర్ తిలక్ వర్మ వంటి టాలెంటెడ్ ప్లేయర్లతో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికే సౌతాఫ్రికాలో వెళ్లిన యంగ్ ఇండియా.. సఫారీలతో వన్డే సిరీస్ను గెలిచి జోరు మీదుంది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో జరిగే మహిళల టీ20 వరల్డ్కప్లో ఇండియా అమ్మాయిలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2018లో వెస్టిండీస్లో జరిగిన లాస్ట్ ఎడిషన్లో హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ధనాధన్ బ్యాటింగ్, బౌలర్ల మెరుపులు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. కానీ, మన జట్టు జోరుకు సెమీస్లో బ్రేక్ పడింది. ఇక, మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత పలువురు యువ క్రికెటర్లతో బరిలో నిలిచిన ఇండియా ఏం చేస్తుందో చూడాలి. గతేడాది వన్డే వరల్డ్కప్లో నిరాశపరిచిన కోహ్లీసేన.. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే టీ20 వరల్డ్కప్కు సమయాత్తమవుతోంది. 2016లో స్వదేశంలో సెమీస్లో ఓడిపోయిన ఇండియా ఈ సారి కూడా పేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిన కోహ్లీసేన మరో ప్రపంచకప్ దేశానికి అందించాలని ఉవ్విళ్లూరుతోంది. సెప్టెంబర్లో ఆసియా కప్ కూడా క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనుంది.
ఆ మెడల్ మెరుపే వేరు..
ఒలింపిక్స్ జూలై 24-ఆగస్టు 9;
వేదిక: టోక్యో
ఎన్ని పతకాలు గెలిచినా.. ఎక్కడ విజేతగా నిలిచినా.. ఒలింపిక్ మెడల్ నెగ్గితే వచ్చే సంతోషమే వేరు.! ఒలింపిక్ మెడలిస్ట్ అంటే దక్కే గౌరవమే వేరు. అత్యంత పోటీ దృష్ట్యా విశ్వక్రీడల్లో పోటీ పడడమే అదృష్టంగా భావిస్తుండగా ఇప్పటిదాకా 24 ఒలింపిక్స్ గేమ్స్ చరిత్రలో ఇండియా 28 మెడల్స్ మాత్రమే గెలిచింది. పొరుగున ఉన్న చైనాతో పాటు మన రాష్ట్రం అంత వైశాల్యం, జనాభా లేని దేశాలూ ఒకేసారి పదుల సంఖ్యలో పతకాలు గెలుస్తుంటే.. ఇండియా మాత్రం ఇంకా ఒకటి.. రెండు.. మూడు అంటోంది. రియోలో జరిగిన గత ఎడిషన్లో కేవలం రెండు పతకాలతో (సింధు రజతం, సాక్షిమాలిక్ కాంస్యం) సరిపెట్టుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా షూటర్లు, పలువురు స్టార్లు తీవ్రంగా నిరాశపరచగా.. ఇద్దరు అమ్మాయిలు దేశ పరువు కాపాడారు. అయితే, ఈ ఒలింపిక్స్ కోసం ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. రియో వైఫల్యం తర్వాత కేంద్ర క్రీడా శాఖ విశ్వక్రీడలపై ప్రత్యేక దృష్టిసారించింది. 2015లో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ను ప్రారంభించింది. సత్తా ఉన్న అథ్లెట్లను అన్వేషించి.. పతకం నెగ్గడమే టార్గెట్గా ట్రైనింగ్, కోచింగ్, డైట్ తదితర అంశాల్లో పూర్తి సహకారం అందిస్తోంది. మరో ఏడు నెలల్లో ప్రారంభం కానున్న గేమ్స్కు ఇండియా నుంచి ఆరు ఆటల్లో 62 మంది అర్హత సాధించారు. పురుషుల, మహిళల హాకీ జట్లలో చెరో 16 మందిని మినహాయిస్తే షూటింగ్లో అత్యధికంగా 15 కోటాలు దక్కాయి.
అథ్లెట్లిక్స్లో ఆరు, రెజ్లింగ్, ఆర్చరీలో నాలుగేసి బెర్తులు రాగా, ఈక్వెస్ట్రియన్ నుంచి ఒకరు క్వాలిఫై అయ్యారు. మిగతా ఆటల్లో క్వాలిఫికేషన్ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, ఎక్కువ సంఖ్యలో బరిలో నిలిచిన షూటర్లపైనే ఈ సారి భారీ అంచనాలున్నాయి. మను భాకర్, సౌరభ్ చౌదరి వంటి యువ షూటర్లపై అందరి దృష్టి ఉంది. రెజ్లర్లు బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగట్, దీపక్ పునియా నుంచి మెడల్స్ ఆశించొచ్చు. ఆర్చరీ అసోసియేషన్ సస్పెన్షన్కు గురి కావడంతో గతేడాది కొన్ని టోర్నీల్లో న్యూట్రల్ అథ్లెట్లుగా ఆడినప్పటికీ అద్భుత పెర్ఫామెన్స్ చేసిన ఆర్చర్లపై కూడా అందరి దృష్టి ఉంది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ద్వారా టోక్యో టిక్కెట్ దక్కించుకుంటే లెజెండరీ బాక్సర్ మేరీకోమ్, అమిత్ పంగల్ నుంచి కూడా పతకం ఆశించొచ్చు. ఒలింపిక్స్లో 8 స్వర్ణాల ఘన చరిత్ర ఉన్న మన హాకీ వీరులు ఈ సారైనా పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తే చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అథ్లెటిక్స్లో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ద్యుతీచంద్, హిమదాస్, నీరజ్ చోప్రాతో పాటు వెయిట్ లిఫ్టింగ్, టెన్నిస్లో ఎంత మంది టోక్యోకు క్వాలిఫై అవుతారో చూడాలి.
రాకెట్లు దూసుకెళ్లేనా..
దశాబ్ద కాలంలో ఇండియా బ్యాడ్మింటన్ ఎంతో ఎత్తుకు చేరుకుంది. సైనా నెహ్వాల్ ఈ ఆటకు ఊపు తీసుకొస్తే, సింధు ఆ క్రేజ్ను ఎన్నో రెట్లు పెంచింది. అయితే, గతేడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన మన షట్లర్లు ఈ సారి ఒలింపిక్స్తో పాటు మిగతా టోర్నీల్లో సత్తా చాటాలని కోరుకుంటున్నారు. రియోలో సిల్వర్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేయడంతో పాటు లాస్ట్ ఇయర్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్తో ఓ కలను నెరవేర్చుకున్న సింధు ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్పై కన్నేసింది. అయితే, గతేడాది వరల్డ్ మెడల్ మినహా ఆమె పెద్దగా రాణించింది లేదు. కానీ, ప్రధాన టోర్నీలు అనగానే ఎక్కడా లేని ఉత్సాహం తెచ్చుకొని.. అంచనాలు తలకిందులు చేసే సింధుపై యావత్ దేశం ఆశలు పెట్టుకుంది. ఆమెతో పాటు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, డబుల్స్లో సాత్విక్––చిరాగ్ జోడీ టోక్యోకు క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో గాయాలతో సతమతమై పేలవంగా ఆడిన సైనా, శ్రీకాంత్ ఈ ఏడాది పుంజుకుంటారో లేదో చూడాలి. పలు సెన్సేషనల్ విక్టరీలు సాధించిన సాత్విక్-–చిరాగ్ జోడీకి ఈ సీజన్ కీలకం కానుంది. ఇక, తమకు అందని ద్రాక్షగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్పై కూడా సింగిల్స్ స్టార్లు ఈ సారి గురి పెట్టారు.
వీడ్కోలుకు వేళాయె..!
పలువురు లెజెండరీ ప్లేయర్లు ఈ ఏడాది తమ కెరీర్కు వీడ్కోలు పలికే చాన్సుంది. 2020 తనకు లాస్ట్ ఇయర్ అని టెన్నిస్ గ్రేట్ లియాండర్ పేస్ ఇప్పటికే కన్ఫామ్ చేయగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ బాక్సర్ మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా అదే బాటలో ఉన్నారు. వన్డే వరల్డ్కప్ ఓటమి అనంతరం ఆటకు దూరమైన ధోనీ ఫ్యూచర్పై అతను కానీ, బీసీసీఐ వర్గాలు కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి. ఈ నెల చివర్లో న్యూజిలాండ్ టూర్తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్న మహీ.. టీ20 ప్రపంచకప్తో కెరీర్కు గుడ్బై చెప్పే చాన్సుంది. ఆటగాడిగా, అద్భుతమైన కెప్టెన్గా ఇండియా క్రికెట్దశను మార్చిన ధోనీకి వరల్డ్కప్తో ఘన వీడ్కోలు పలకాలని టీమిండియా కూడా భావిస్తోంది. ఇక, తన మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో18 గ్రాండ్స్లామ్ టైటిల్స్… ఒలింపిక్స్ మెడల్… 55 టైటిల్స్ అందుకున్న పేస్కు ఇదే లాస్ట్ ఇయర్. వయసురీత్యా మేరీకోమ్, సుశీల్ కూడా ఈ ఏడాదే తమ ఆటకు టాటా చెప్పొచ్చు.
సానియా వస్తోంది..
రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది మళ్లీ రాకెట్ పట్టనుంది. చివరగా 2017లో చైనా ఓపెన్ ఆడిన సానియా బాబుకు జన్మనిచ్చి మెటర్నిటీ బ్రేక్ తీసుకుంది. ఈ నెల 11న మొదలయ్యే హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది