హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్సర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ) ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న కీలక రహదారి మౌలిక వసతుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. సంబంధిత టెండర్ కాంట్రాక్ట్ను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్కు అప్పగిస్తూ మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ) శాఖ బుధవారం జీవో 784ను జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఒవైసీ ఫ్లైఓవర్కు లెఫ్ట్ ఆర్మ్ డౌన్ ర్యాంప్ నిర్మాణం, హఫీజ్బాబా నగర్ నుంచి బాలాపూర్-చర్చ్ రోడ్ వరకు ఆరు లేన్ల టూవే గ్రేడ్ సెపరేటర్, అలాగే బండ్లగూడ -ఎర్రకుంట క్రాస్రోడ్ వద్ద ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.231.87 కోట్ల ఐబీఎం విలువపై 4.68 శాతం అదనంగా రూ.242.72 కోట్లకు కేఎన్ఆర్ సంస్థ బిడ్ దాఖలు చేసింది.
24 నెలల కాలపరిమితితో ఈపీసీ విధానంలో ఈ పనులు పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో కేఎన్ఆర్ సంస్థతో త్వరలో ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్కు అనుమతి లభించింది.
