- లవంగాలు, సాజీరాకు సింథటిక్ కలర్స్
- ఆవాలకు హెయిర్ డై, రైస్ బ్రాన్ ఆయిల్ పూత
- 25 వేల 300 కిలోల కల్తీ మసాలాలు సీజ్
- సోంపు, జీలకర్ర, వాముకూ రంగులు.. బట్టలు, ఇండస్ట్రీస్ కలర్స్తో కల్తీ
- హైదరాబాద్లోని బేగంబజార్లో హెచ్ ఫాస్ట్ పోలీసుల దాడులు
- నిందితులపై పీడీ యాక్ట్, దర్యాప్తుకు సిట్ ఏర్పాటు: సీపీ సజ్జనార్
- తాగే పాలు మొదలు నిత్యావసర వస్తువులన్నీ కల్తీనేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అన్నం తిన్నాక అరిగేందుకని కాస్త సోంపు నోట్లో వేసుకుంటే జీర్ణం సంగతి అటుంచి స్టమక్అల్సరో, క్యాన్సరో రావచ్చు! జలుబో, దగ్గో, గొంతు గరగరో ఉందని ఓ లవంగం నోట్లో వేసుకుంటే రోగాలు పోవడం అటుంచి ప్రాణాలే పోవచ్చు! ఎందుకంటే మనం వాడుతున్న మసాలా దినుసులన్నీ కల్తీమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్లోని బేగంబజార్
హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్(హెచ్ ఫాస్ట్) చేసిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. మసాలా దినుసులు నిగనిగలాడించేందుకు వ్యాపారులు సింథటిక్, ఇండస్ట్రియల్ కలర్స్, ఆఖరికి హెయిర్ డై కలుపుతున్న విషయం తెలిసి అధికారులే నివ్వెరపోయారు.
నాలుగుచోట్ల దాడులు
హైదరాబాద్లోని బేగంబజార్, కాటేదాన్, మైలార్దేవ్పల్లి, బాలాపూర్లోని మసాలా దినుసుల కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో కల్తీ దందా గుట్టురట్టయింది. మొత్తం 25 వేల 300 కిలోల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేసిన పోలీసులు ముగ్గురు వ్యాపారులను అరెస్ట్ చేశారు. లవంగాలు, ఆవాలు, సాజీరా, జీలకర్ర, సోంపు, వాము తదితర మసాలాలు నిగనిగలాడేందుకు సింథటిక్ కలర్స్, బట్టలకు అద్దే రంగులు, హెయిర్ డై (కలర్) వాడుతున్నట్టు గుర్తించారు.
సువాసన కోసం ముఖానికి వేసుకునే టాల్కం పౌడర్ వాడుతున్నట్టు తేల్చారు. ఇందుకు సంబంధించి హైద రాబాద్ సీపీ సజ్జనార్, జాయింట్ సీపీ విజయ్కుమార్, హెచ్ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కెమికల్స్, సింథటిక్ కలర్స్తో మసాలా దినుసులను కల్తీ చేస్తున్న విధానాన్ని డెమో ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రాణాలకు హాని కలిగించే విధంగా కల్తీ మసాలాలు తయారు చేస్తున్న నిందితులపై దేశంలోనే మొట్టమొదటిసారిగా బీఎన్ఎస్ 110 సెక్షన్ కింద కేసులు పెట్టామని తెలిపారు. పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని వెల్లడించారు. ఆహార కల్తీల మూలాలను వెలికితీసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
హోల్ సేల్గా దందా
రాజస్థాన్కు చెందిన విశాల్ పవర్, దులిచంద్ కచ్చవర్ బేగంబజార్లో రాహుల్ భాటి కాటేదాన్లో నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురి కుటుంబాలు
కొన్నేండ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డాయి. వీరు బేగంబజార్ సహా హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్లలో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. జీలకర్ర, లవంగాలు వివిధ మసాలా దినుసులను తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక సహా దేశ వ్యాప్తంగా హోల్సేల్గా విక్రయిస్తుంటారు. ఈ మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాటేదాన్, మైలార్దేవ్పల్లి, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మూడు యూనిట్లలో మసాలాలను కల్తీ చేసి బేగంబజార్తో పాటు సిటీలోని హోల్సేల్ మార్కెట్లకు సప్లయ్ చేస్తున్నారు. ప్రధానంగా ఆహారంలో తప్పనిసరిగా వినియోగించే లవంగాలు, ఆవాలు, సాజీరా, సోంపు సహా 11 రకాల మసాలాలు, రిఫైండ్ ఆయిల్ను కల్తీ చేస్తున్నారు.
ఒక్కో మసాలాకు ఒక్కో కలర్, సింథటిక్ కెమికల్
సింథటిక్ ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్స్తోపాటు దుస్తుల అద్దకానికి వాడే రంగులు, పరిశ్రమల్లో వినియోగించే కలర్స్, హెయిర్డైలో వాడే నైట్రోజన్, అమోనియంలాంటి కెమికల్స్తో కూడిన రంగులను మసాలా దినుసులకు కలుపుతున్నారు. మరింత షైనింగ్, సువాసన కోసం టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్నూ వినియోగిస్తున్నారు. కంపెనీల నుంచి సేకరించిన నాసిరకం ఆవాల స్టాక్కు ఫ్యాబ్రిక్ డై (హెయిర్ కలర్), టాల్కం పౌడర్, ఆయిల్ను కలుపుతున్నారు. తద్వారా వీటికి కృత్రిమమైన మెరుపు తెప్పించడంతోపాటు బరువు పెంచుతున్నారు. లవంగాలు, సాజీరాలాంటి సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయ రంగు కోసం సింథటిక్ కలర్స్పైపూతగా వేస్తున్నారు. సాజీరా, వాముకు పరిశ్రమల్లో ఉపయోగించే రంగులను కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన కల్తీ మసాలాలను పలు రకాల కంపెనీల పేరిట లేబులింగ్ స్టిక్కరింగ్ చేసి, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక సహా పలు రాష్ట్రాలకు 50 % తక్కువ రేట్లకే సప్లయ్ చేస్తున్నారు.
3 రోజుల జాయింట్ ఆపరేషన్..
కల్తీ మసాలాల దందా గురించి సమాచారం అంద డంతో హెచ్ ఫాస్ట్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన అధికారులు శనివారం నుంచి సోమవారం వర కు మూడు రోజులపాటు జాయింట్ ఆపరేషన్ చేశారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మసాలాల వ్యాపా రులు సహా 13 ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు నిర్వహించారు. కల్తీ మసాలాలకు సంబంధించి మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, బాలాపూర్ పీఎస్ పరిధిలో మరో కేసు నమోదు చేశారు. కాటేదాన్కు చెందిన రాహుల్ భాటి, బేగంబజార్కు చెందిన విశాల్ పవర్, దులిచంద్ కచ్చవర్ను అరెస్ట్ చేశారు.
హెచ్ ఫాస్ట్ తనిఖీలు.. బయటపడ్డ కల్తీలు..
ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు జులై 17న హైదరాబాద్ సిటీలో సంయుక్తంగా చేసిన దాడుల్లో 850 కిలోల కల్తీ నెయ్యి, క్రీమ్ను సీజ్ చేశారు. క్యూర్ ఏరియా పరిధిలోని 14 నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాల్లో సోదాలు నిర్వహించి 15 నమూనాలను సేకరించారు. ఆయాచోట్ల పూర్తిగా కలుషితమైన, తినడానికి పనికి రాని మరో 60 కిలోల నెయ్యిని అక్కడే ధ్వంసం చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో జులై 15న టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్తీ పాల తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేసి.. 150 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. శివన్నగారి సుధాకర్ గౌడ్ అనే వ్యక్తి పాల పౌడర్, కెమికల్స్ మిక్స్ చేసి కల్తీ పాలను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. టాస్క్ఫోర్స్ పోలీసుల సమాచారంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రదీప్ కుమార్అక్కడకు చేరుకొని కల్తీ పాలు, రసాయనాలను సీజ్ చేశారు.
జూన్ 18న హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వై లెన్స్ టీమ్ పోలీసులు హైదరాబాద్లోని 45 దుకా ణాలు, 8 పనీర్ తయారీ కేంద్రాల మీద దాడులు చేసి 825 కిలోల నకిలీ పనీర్ను పట్టుకున్నారు. తప్పుడు బ్రాండింగ్తో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కొందరు వ్యాపారులు తక్కువ ధరకు లభించే చీజ్ అనలాగ్ పనీర్ను ఎక్కువ రేటు ఉండే మలై పనీర్గా చెప్పి అమ్ముతున్నారని గుర్తించారు.
హైదరాబాద్లోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గోదాములపై హెచ్ఫాస్ట్ పోలీసులు ఏప్రిల్ 1న దాడులు నిర్వహించారు.10 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మేకలను తక్కువ ధరకు కొనుగోలు చేసి జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, యూపీలాంటి రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు గుర్తించారు.ఈ కుళ్లిన మాంసాన్ని హైదరాబాద్లోని హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్టు హెచ్ ఫాస్ట్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
4 నెలల వ్యవధిలోనే 659 కేసులు
పిల్లలు తాగే పాలు మొదలు వంటింట్లో వాడే ప్రతి వస్తువునూ కల్తీ మాఫియా టార్గెట్ చేసింది. నెయ్యి, నూనె, చాయ్పత్తి, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి, పనీర్, ఐస్క్రీం.. ఇలా నిత్యావసరాల్లో దేనినీ వదలడం లేదు. హోటళ్లలో తినే ఫుడ్ సరేసరి.. ఆఖరికి షాపుల్లో దొరికే బ్రాండెడ్ వస్తువులనూ కల్తీ చేస్తున్నారు. బ్రూక్ బాండ్, రెడ్ లేబుల్, జెమినీలాంటి కంపెనీల ప్యాకింగ్లలో నకిలీ టీపొడి నింపి అమ్ముతున్నారు. ప్యారాష్యూట్ పేరిట నాసిరకం కొబ్బరి నూనె, వివిధ కంపెనీల పేరుతో సబ్బులు, సర్ఫ్లు, ఆఖరికి లైజాల్, హార్పిక్ను కూడా కల్తీ చేసి మార్కెట్ చేస్తున్నారు. తాజాగా మసాలా దినుసుల కల్తీ దందా బయటపడింది. కాగా, హెచ్ ఫాస్ట్ ప్రారంభమైన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి, 246 టన్నుల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకుంది.
నిందితులపై 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 46 పనీర్, 83 నెయ్యి, అల్లం వెల్లుల్లి కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి, అల్లం -వెల్లుల్లి పేస్ట్ తెల్లగా, చిక్కగా కనిపించడానికి పెయింట్లలో వాడే ‘టైటానియం ఆక్సైడ్’, ‘ఎసిటిక్ యాసిడ్’ ఉపయోగిస్తున్నట్టు గుర్తించింది. 32 కేంద్రాల్లో పొట్టు తీయని, కుళ్లిన అల్లం, వెల్లుల్లితో కూడిన 27 టన్నులకు పైగా కల్తీ పేస్ట్ను సీజ్ చేసింది.12 టన్నులకుపైగా కుళ్లిన కోడి, మేక మాంసంతో పాటు హోటళ్లకు సరఫరా చేసేందుకు నిల్వ ఉంచిన 60 టన్నుల కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకుంది. రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్న 16 కేంద్రాల్లో 25.8 టన్నుల పండ్లు, 9.2 టన్నుల కల్తీ ఊరగాయలు, 3.8 టన్నుల కల్తీ టీ పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూరియా, డిటర్జెంట్లు, పామ్ ఆయిల్ సహా ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న సింథటిక్ పనీర్ గుట్టునూ రట్టు చేసింది. 1.5 టన్నుల సింథటిక్ పనీర్, 2.5 టన్నుల కల్తీ పెరుగు, 3.2 టన్నుల క్రీమ్, నెయ్యి , నూనెలను స్వాధీనం చేసుకుంది.
కల్తీలతో ఇవీ సమస్యలు..
- కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం
- కడుపునొప్పి, అల్సర్లులాంటి జీర్ణకోశ వ్యాధులు
- వివిధ రకాల క్యాన్సర్లు ,అలర్జీలు, చర్మ వ్యాధులు,
- న్యూరో సమస్యలు, శరీర రోగనిరోధక శక్తిపై ప్రభావం
కల్తీని ఇలా గుర్తించాలి..
సాధారణంగా బియ్యం వండే ముందు కడుగుతాం. కానీ మసాలాలు కడిగే అవకాశం ఉండదు. దీని వల్ల గరం మసాలాలను కల్తీ చేయడం హోల్సేల్ వ్యాపారులకు సులభంగా మారింది. ఇలాంటి వాటిని గుర్తించాలంటే.. లవంగాలు, జీలకర్ర సహా ఎలాంటి మసాలాలు కొనుగోలు చేసినా మొదట ఒక గాజు గ్లాస్లో నీటిని తీసుకుని వాటిలో వేయాలి. నీళ్ల రంగు ఎరుపు లేదా నలుపు రంగులోకి మారితే వాటికి సింథటిక్ కలర్స్, కెమికల్స్ కలిపినట్లు గుర్తించాలి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.
కల్తీ గుర్తిస్తే డయల్ 100కు కాల్ చేయండి
ఆహార పదార్థాల్లో అత్యంత ప్రాణాంతక కెమిక ల్స్ను వినియోగిస్తు న్నారు. ఇవి సింథటిక్ డ్రగ్స్ తరహాలోనే మనిషిలోని లంగ్స్, లివర్, గుండె, నరాలు సహా శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. మనకు తెలియకుండానే మరణా నికి చేరువవుతాం. కల్తీ మాఫియాను అరికట్టడం ఒక్క పోలీసులు, ఇతర సంస్థల వల్లనే సాధ్యం కాదు. ప్రజల సహకారం తప్పనిసరి. కల్తీల గురించి తెలిస్తే డయల్ 100 లేదా హెచ్ ఫాస్ట్ హెల్ప్ లైన్: 8712661212 కు సమాచారం ఇవ్వాలి.
- వీసీ సజ్జనార్, సీపీ, హైదరాబాద్
