అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్​లోకి గంజాయి బ్యాచ్

అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్​లోకి గంజాయి బ్యాచ్
  • అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్​లోకి గంజాయి బ్యాచ్
  • ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు.. మరో ఇద్దరు నిందితుల పరార్​
  • సికింద్రాబాద్​ పీజీ కాలేజీ లేడీస్​ హాస్టల్​లో ఘటన
  • తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినుల ధర్నా

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​లోని ఓయూ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్​లో అర్ధరాత్రి ముగ్గురు సభ్యుల గంజాయి బ్యాచ్​ చొరబడింది. దీంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి 12.20 గంటల ప్రాంతంలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు దుండగులు హాస్టల్ వెనుక వైపు నుంచి ప్రహరీ గోడ దూకి హాస్టల్​ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం బాత్​రూమ్​లోకి చొరబడి అసభ్యకరమైన సైగలు చేయడం మొదలు పెట్టారు. దీంతో విద్యార్థినులు భయపడ్డారు. కొందరు విద్యార్థినులు ధైర్యం చేసి.. ఓ దుండగుడ్ని పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. అయితే.. దొరికిన ఆ దుండగుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో అమ్మాయిలపై దాడి చేశాడు. ఈ దాడిలో పీజీ ఎమ్మెస్సీ స్టూడెంట్​ అంజని చేతికి గాయమైంది. దుండగుడ్ని అమ్మాయిలు అక్కడే బంధించారు. విషయం తెలుసుకున్న అదే కాంపౌండ్​లోని బాయ్స్​ హాస్టల్​ నుంచి అబ్బాయిలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్​కు చేరుకొని దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

విద్యార్థినుల ఆందోళన

హాస్టల్​లో తమకు రక్షణ కల్పించాలంటూ సికింద్రాబాద్​ పీజీ కాలేజీ విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగారు. హాస్టల్​లోకి అర్దరాత్రి అగంతకులు చొరబడి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ క్యాంపస్​లో  బైఠాయించి నిరసన తెలిపారు. అగంతకుడ్ని పోలీసులు తీసుకెళ్లే క్రమంలో హాస్టల్​లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు వాహనాన్ని స్టూడెంట్లు అడ్డుకున్నారు. హాస్టల్​లో తమకు రక్షణ కరువైందని వాపోయారు. విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నార్త్​జోన్​ డీసీపీ  రోహిణి ప్రియదర్శిని అక్కడికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు. ఓయూ అధికారులతో మాట్లాడి రక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

మెట్రో స్టేషన్​ దగ్గర గంజాయి బ్యాచ్​ అడ్డా..!

గతంలో పీజీ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలకు ఓయూ క్యాంపస్​ హాస్టళ్లలో వసతి కల్పించేవారు. అయితే హాస్టల్​కు వెళ్లిరావడం దూరమవుతుందని భావించి.. కాలేజీ ఆవరణలోనే అమ్మాయిల కోసం రెండస్తుల్లో 28 గదులతో కూడిన భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనం పనులు ఒక వైపు జరుగుతుండగానే మరో వైపు అధికారులు నాలుగు నెలల కింద క్యాంపస్​ హాస్టల్​లోని అమ్మాయిలను ఇక్కడి భవనంలోకి షిఫ్ట్​ చేశారు. సికింద్రాబాద్​ పీజీ కాలేజీలో  చదువుతున్న  180 మంది విద్యార్థినులతో పాటు నిజాం కాలేజీకి చెందిన మరో 60 మందికి ఇందులో వసతి కల్పించారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్​లో పూర్తి స్థాయి వసతులు లేకపోవడంతో నలుగురు అమ్మాయిలు ఉండే ఒక్కో గదిలో 20 మంది ఉంటున్నారు. తమకు  సరిపడా వాష్​ రూమ్​లు, నీటి వసతి కూడా లేదని అమ్మాయిలు వాపోయారు. 

ఈ హాస్టల్​లో రక్షణ కరువైందని, తమను తిరిగి ఓయూ క్యాంపస్​హాస్టళ్లకే మార్చాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా  హాస్టల్​ ప్రహరీ గోడలు చాలా చిన్నవిగా తక్కువ ఎత్తులో ఉన్నాయని, హాస్టల్​లో ఇప్పటి వరకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. గోడలు చిన్నవిగా ఉండటంతోనే గంజాయి బ్యాచ్​ తమ హాస్టల్​లోకి చొరబడుతున్నదని అన్నారు. 

తమ హాస్టల్​కు ఎదురుగానే  మెట్రో స్టేషన్​ ఉందని, రాత్రి 8 గంటలు దాటితే అక్కడ కొందరు అగంతకులు చేరి గంజాయి తాగుతూ వికృత  చేష్టలకు పాల్పడుతుంటారని  అమ్మాయిలు వాపోయారు. గంజాయి మత్తులో స్టేషన్​ మెట్లపై కూర్చుని ఎప్పుడు హాస్టల్​ వైపు చూస్తూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని, రాత్రి ఏదైనా అర్జంట్​ పని ఉంటే ప్యారడైజ్​ వరకు వెళ్లాలన్నా భయంతో బయటకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. కాగా, హాస్టల్​లో జరిగిన ఘటనపై  ఓయూ వైస్​ చాన్స్​లర్​ ప్రొఫెసర్​ రవీందర్​, రిజిస్ట్రార్​ ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ, కాలేజీ ప్రిన్సిపాల్​ రవికుమార్​, ఇతర అధికారులు స్టూడెంట్లతో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే రాత్రి సమయంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో కూడిన భద్రతా సిబ్బందిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. హాస్టల్​ చుట్టూ పది అడుగుల ఎత్తుతో గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తం:  నార్త్​ జోన్​ డీసీపీ

సికింద్రాబాద్​ పీజీ కాలేజీ లేడీస్​హాస్టల్​లో ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేస్తామని నార్త్​జోన్​ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. హాస్టల్​లోకి దుండగులు గోడదూకి లోపలికి ప్రవేశించడం వల్ల విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారని,ఈ సంఘటన చాలా బాధారకమని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు.