
- అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్
- ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు.. మరో ఇద్దరు నిందితుల పరార్
- సికింద్రాబాద్ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్లో ఘటన
- తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినుల ధర్నా
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్లోని ఓయూ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి ముగ్గురు సభ్యుల గంజాయి బ్యాచ్ చొరబడింది. దీంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి 12.20 గంటల ప్రాంతంలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు దుండగులు హాస్టల్ వెనుక వైపు నుంచి ప్రహరీ గోడ దూకి హాస్టల్ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం బాత్రూమ్లోకి చొరబడి అసభ్యకరమైన సైగలు చేయడం మొదలు పెట్టారు. దీంతో విద్యార్థినులు భయపడ్డారు. కొందరు విద్యార్థినులు ధైర్యం చేసి.. ఓ దుండగుడ్ని పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. అయితే.. దొరికిన ఆ దుండగుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో అమ్మాయిలపై దాడి చేశాడు. ఈ దాడిలో పీజీ ఎమ్మెస్సీ స్టూడెంట్ అంజని చేతికి గాయమైంది. దుండగుడ్ని అమ్మాయిలు అక్కడే బంధించారు. విషయం తెలుసుకున్న అదే కాంపౌండ్లోని బాయ్స్ హాస్టల్ నుంచి అబ్బాయిలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్కు చేరుకొని దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థినుల ఆందోళన
హాస్టల్లో తమకు రక్షణ కల్పించాలంటూ సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగారు. హాస్టల్లోకి అర్దరాత్రి అగంతకులు చొరబడి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ క్యాంపస్లో బైఠాయించి నిరసన తెలిపారు. అగంతకుడ్ని పోలీసులు తీసుకెళ్లే క్రమంలో హాస్టల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు వాహనాన్ని స్టూడెంట్లు అడ్డుకున్నారు. హాస్టల్లో తమకు రక్షణ కరువైందని వాపోయారు. విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నార్త్జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అక్కడికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు. ఓయూ అధికారులతో మాట్లాడి రక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మెట్రో స్టేషన్ దగ్గర గంజాయి బ్యాచ్ అడ్డా..!
గతంలో పీజీ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలకు ఓయూ క్యాంపస్ హాస్టళ్లలో వసతి కల్పించేవారు. అయితే హాస్టల్కు వెళ్లిరావడం దూరమవుతుందని భావించి.. కాలేజీ ఆవరణలోనే అమ్మాయిల కోసం రెండస్తుల్లో 28 గదులతో కూడిన భవన నిర్మాణం చేపట్టారు. ఈ భవనం పనులు ఒక వైపు జరుగుతుండగానే మరో వైపు అధికారులు నాలుగు నెలల కింద క్యాంపస్ హాస్టల్లోని అమ్మాయిలను ఇక్కడి భవనంలోకి షిఫ్ట్ చేశారు. సికింద్రాబాద్ పీజీ కాలేజీలో చదువుతున్న 180 మంది విద్యార్థినులతో పాటు నిజాం కాలేజీకి చెందిన మరో 60 మందికి ఇందులో వసతి కల్పించారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్లో పూర్తి స్థాయి వసతులు లేకపోవడంతో నలుగురు అమ్మాయిలు ఉండే ఒక్కో గదిలో 20 మంది ఉంటున్నారు. తమకు సరిపడా వాష్ రూమ్లు, నీటి వసతి కూడా లేదని అమ్మాయిలు వాపోయారు.
ఈ హాస్టల్లో రక్షణ కరువైందని, తమను తిరిగి ఓయూ క్యాంపస్హాస్టళ్లకే మార్చాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా హాస్టల్ ప్రహరీ గోడలు చాలా చిన్నవిగా తక్కువ ఎత్తులో ఉన్నాయని, హాస్టల్లో ఇప్పటి వరకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. గోడలు చిన్నవిగా ఉండటంతోనే గంజాయి బ్యాచ్ తమ హాస్టల్లోకి చొరబడుతున్నదని అన్నారు.
తమ హాస్టల్కు ఎదురుగానే మెట్రో స్టేషన్ ఉందని, రాత్రి 8 గంటలు దాటితే అక్కడ కొందరు అగంతకులు చేరి గంజాయి తాగుతూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారని అమ్మాయిలు వాపోయారు. గంజాయి మత్తులో స్టేషన్ మెట్లపై కూర్చుని ఎప్పుడు హాస్టల్ వైపు చూస్తూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని, రాత్రి ఏదైనా అర్జంట్ పని ఉంటే ప్యారడైజ్ వరకు వెళ్లాలన్నా భయంతో బయటకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. కాగా, హాస్టల్లో జరిగిన ఘటనపై ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కాలేజీ ప్రిన్సిపాల్ రవికుమార్, ఇతర అధికారులు స్టూడెంట్లతో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే రాత్రి సమయంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో కూడిన భద్రతా సిబ్బందిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. హాస్టల్ చుట్టూ పది అడుగుల ఎత్తుతో గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తం: నార్త్ జోన్ డీసీపీ
సికింద్రాబాద్ పీజీ కాలేజీ లేడీస్హాస్టల్లో ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేస్తామని నార్త్జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. హాస్టల్లోకి దుండగులు గోడదూకి లోపలికి ప్రవేశించడం వల్ల విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారని,ఈ సంఘటన చాలా బాధారకమని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు.