- స్ట్రాటజీ మార్చిన ఎఫ్ఎంసీజీ కంపెనీలు
- పాపులర్ బ్రాండ్లలో ప్రీమియం ప్రొడక్ట్లు
- సాధారణ ధర కంటే కనీసం 30 శాతం ఎక్కువ
- గ్రామాల్లో పెరుగుతున్న అమ్మకాలు
న్యూఢిల్లీ: మిల్లెట్స్ (చిరుధాన్యాలు) చేసిన చిప్స్ ప్యాకెట్, ప్రొటీన్ ఎక్కువగా ఉండే చాక్లెట్ బార్, లేదా కెమికల్స్ లేని స్కిన్ కేర్ ప్రొడక్ట్.. పేరు ఏదైనా కంపెనీల గోల్ మాత్రం ఒక్కటే. తమ ప్రొడక్ట్లు ఆరోగ్యకరమంటూ ప్రమోట్ చేసి, కన్జూమర్ల నుంచి ఎక్కువ వసూలు చేయడమే. పోషకాహారానికి వినియోగదారులు ఇస్తున్న ప్రాధాన్యాన్ని బ్రాండ్లు సొమ్ము చేసుకుంటున్నాయి. దీంతో దశాబ్దాలుగా కేవలం అమ్మకాల సైజ్ పైనే ఆధారపడిన భారతీయ ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. పాపులర్ బ్రాండ్లలో మిల్లెట్స్, ప్రొటీన్ వంటివి కలిసి ప్రీమియం ప్రొడక్ట్గా ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి.
లగ్జరీ ప్రొడక్ట్ల అమ్మకాలు జూమ్
మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'నీల్సన్ ఐక్యూ' రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో ఎఫ్ఎంసీజీ మార్కెట్ మొత్తం వృద్ధి 9.2శాతంగా నమోదైంది. ప్రీమియం- ప్లస్ కేటగిరీలు ఏటా 9.9శాతం వృద్ధితో ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా 'లగ్జరీ సెగ్మెంట్' (సాధారణ ధర కంటే రెట్టింపు ధర ఉండే కేటగిరీ) ఏకంగా 13.6శాతం వృద్ధితో మార్కెట్లోనే అత్యంత వేగంగా దూసుకుపోతోంది.
ఇదే టైమ్లో సాధారణ స్నాక్స్ అమ్మకాల సైజ్ 0.2శాతం తగ్గగా, లగ్జరీ స్నాక్స్ అమ్మకాలు మాత్రం 7.3శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో మొత్తం డిమాండ్ మందగించినా, కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులను ఎంచుకోవడంతో కంపెనీల ఆదాయాలు పెద్దగా తగ్గడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మొత్తం ఎఫ్ఎంసీజీ అమ్మకాల వాల్యూలో ప్రీమియం ఉత్పత్తుల వాటా 25-–26శాతం వరకు ఉందని వివరించాయి.
పాత బ్రాండ్లే కొత్తగా..
కంపెనీలు కూడా కొత్త బ్రాండ్లను తెచ్చే బదులు, ఇప్పటికే మార్కెట్లో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న బ్రాండ్లను ప్రీమియం స్థాయికి విస్తరించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొత్తగా లాంచ్ అయ్యే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులలో చాలావరకు మొదటి ఏడాదిలోనే విఫలమవుతుంటాయి. అదే పాత బ్రాండ్లను ప్రీమియం బ్రాండ్గా మారిస్తే సక్సెస్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక కస్టమర్ కొత్త పేరుతో ఉన్న ప్రొడక్ట్ కంటే తాము ఏళ్ల తరబడి వాడుతున్న బ్రాండ్ (ఉదాహరణకు సర్ఫ్ ఎక్సెల్ లేదా డవ్) లోనే ఎక్కువ ధర ఉన్న వేరియంట్ను కొనడానికి మొగ్గు చూపుతారని ఈక్విరస్ సెక్యూరిటీస్ లీడ్ అనలిస్ట్ రోనక్ షా పేర్కొన్నారు.
క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి మాట్లాడుతూ, ఉన్న బ్రాండ్లను వాడుకోవడం వల్ల మార్కెటింగ్ ఖర్చులు తగ్గడమే కాకుండా కంపెనీలకు అధిక లాభాల మార్జిన్లు వస్తాయన్నారు. కాగా, పారాషూట్, లివోన్ వంటి బ్రాండ్లు నిర్వహిస్తున్న మారికో, తన ప్రీమియం పర్సనల్ కేర్ విభాగం ద్వారా 2025–26 నాటికి రూ. 300 కోట్లకు పైగా ఆన్యువల్ రికరింగ్ రెవెన్యూ (ఏఆర్ఆర్) ను సాధిస్తోంది. తమ ప్రీమియం విభాగాల ప్రొడక్షన్ కెపాసిటీని పెంచాలని హిందుస్తాన్ యూనిలీవర్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం రాబోయే రెండేళ్లలో రూ. రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
గ్రామాల్లో జోరు
ప్రీమియం ప్రొడక్ట్ల సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం కంపెనీలు మెరుగైన క్వాలిటీ, అదనపు పోషకాలు, ప్యాకేజింగ్, బ్రాండ్ లాయల్టీ వంటివి ఇస్తుండడమే. ముఖ్యంగా పిల్లలు, జెన్-జీ యువతను లక్ష్యంగా చేసుకుని హెల్త్, న్యూట్రిషన్ ఆధారిత మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతోంది. కస్టమర్లు సాధారణ ధరల కంటే 25-30శాతం ప్రీమియం చెల్లించడానికి వెనుకాడటం లేదు.
ఇంకా ఈ ప్రీమియమైజేషన్ ట్రెండ్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. నీల్సన్ ఐక్యూ డేటా ప్రకారం, మెట్రో నగరాల్లో ప్రీమియం ప్రొడక్ట్ల అమ్మకాలు గత ఏడాది కాలంలో 4.9శాతం పెరగగా, గ్రామీణ మార్కెట్లలో ఇది ఏకంగా 13.6శాతంగా నమోదైంది. చిన్న ప్యాకెట్లు రావడంతో అల్పాదాయ వర్గాల వారు కూడా వీటిని కొంటున్నారు. ధరలు పెంచినా, దానికి తగ్గ విలువ అందిస్తే కొనడానికి కూడా కస్టమర్లు ఆలోచించడం లేదు.
