ఇండియాకు 307 పురాతన విగ్రహాలు

ఇండియాకు 307 పురాతన విగ్రహాలు

న్యూఢిల్లీ: మనదేశం నుంచి అక్రమంగా రవాణా అయిన 307 పురాతన విగ్రహాలు, వస్తువులను అమెరికా భారతదేశానికి తిరిగి ఇచ్చేసింది. ఇవన్నీ గతంలో మన దేశం నుంచి అఫ్గానిస్తాన్, కంబోడియా ఇండోనేషియా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలకు, అక్కడ్నుంచి అమెరికాకు ఇల్లీగల్​గా రవాణా అయ్యాయి. న్యూయార్క్​లోని ఇండియన్ కాన్సులేట్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ వస్తువులను అప్పగించినట్లు మాన్‌హట్టన్​ జిల్లా అటార్నీ కార్యాలయం తెలిపింది. 15 ఏండ్ల విచారణ తర్వాత ఎట్టకేలకు ఆ వస్తువులన్నీ యూఎస్ తిరిగి ఇండియాకు అప్పగించింది. వీటి విలువ రూ.33 కోట్లు. 

స్మగ్లర్​ సుభాష్​​ నుంచే 235 వస్తువులు..
పురాతన వస్తువులను సుభాశ్ కపూర్ స్మగ్లింగ్​ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 12–13వ శతాబ్దానికి చెందిన మార్బుల్​తో తయారు చేసిన ‘ఆర్చ్​ పరికర’ను కపూర్​నుంచి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.70లక్షలపైనే ఉంటుందని ఇండియా కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్​ చెప్పారు. ‘ఆర్చ్​ పరికర’ను నాథన్​ రుబిన్​ ఇడా లాడ్​ ఫ్యామిలీ, 2007లో యాలే యూనివర్సిటీ ఆర్ట్​ గ్యాలరీకి డొనేట్​ చేసిందని, అక్కడి నుంచి కపూర్​ ఎత్తుకొచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు. కపూర్, అతని గ్యాంగ్​ నుంచి 2011–2022 మధ్య 2,500 వస్తువులను హోంల్యాండ్​ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ రూ.1,188 కోట్లు ఉంటుందన్నారు. 2022లో రూ.697 కోట్లు విలువ చేసే 682 వస్తువులను 13 దేశాలకు యూఎస్​ అప్పగించింది. ‘పురాతన వస్తువుల ట్రాఫికింగ్​ యూనిట్’ ఏర్పాటు చేసినప్పటి నుంచి రూ.1,328 కోట్లు విలువ చేసే 2,200 వస్తువులను 22 దేశాలకు అప్పగించింది.