
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: సూర్యాపేట జిల్లాలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జిల్లాలో ఈ నెల 03వ తేదీన మొదటి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలు వెళ్లి వచ్చినట్లు తెలియడంతో అతడికి పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ రావడంతో అతడిని వెంటనే ఐసోలేషన్ కు తరలించి, అతడు ఎవరెవరిని కలిశాడో గుర్తించి వారికీ పరీక్షలు నిర్వహించారు. 15వ తేదీ వరకు జిల్లాలో 23 పాజిటివ్ కేసులు ఉండగా, తర్వాతి రెండు రోజుల్లోనే ఆ సంఖ్య 54కు చేరుకుంది. గురువారం ఒక్క రోజే 16 కేసులు నమోదు కాగా, శుక్రవారం మరో 15 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తంలో 41 కేసులు ఒక్క సూర్యాపేట పట్టణంలోనే ఉన్నాయి.
అన్నింటికీ లింక్ మార్కెట్టే..
సూర్యాపేటలో నమోదైన వాటిలో ఎక్కువ కేసులకు మార్కెట్ తోనే లింక్ ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. పట్టణంలో మొత్తం 41 కేసులు నిర్ధారణ కాగా, ఇందులో 36 కేసులు మార్కెట్ తో సంబంధం ఉన్నవే. సూర్యాపేట పట్టణంలో మూడో పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి మార్కెట్ లో కిరాణ దుకాణం నిర్వహిస్తుంటాడు. లాక్ డౌన్ సమయంలోనూ దుకాణం నడవడంతో అక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన అధికారులు మార్కెట్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికే రెడ్ జోన్ గా ప్రకటించిన ఆఫీసర్లు మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్ కు కిలోమీటర్ పరిధి ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ప్రకటించి పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంటాక్ట్స్ ను వైద్యాధికారులు గుర్తిస్తున్నారు.
తాజాగా మరో 15
సూర్యాపేట జిల్లాలో శుక్రవారం 15 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో పట్టణంలోని మార్కెట్ ఏరియాకు సంబంధించిన వారే 12 మంది ఉండగా, ముగ్గురు బీబీగూడెంకు చెందిన వ్యక్తులకు నిర్ధారణ అయింది. దీంతో వీరికి సంబంధించిన బంధువులను క్వారంటైన్కు తరలించారు. అదే విధంగా వారు ఎవరెవరిని కలిశారో గుర్తించే పనిలో ఉన్నారు.
పట్టణం మొత్తం రెడ్ జోన్
సూర్యాపేటలో కేసులు పెరుగుతుండడంతో పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతి వార్డుకు ఒక ఇన్ చార్జ్ ను నియమించి ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను ఇంటింటికీ అందేలా చూస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రాకుండా లాక్ డౌన్ ను మరింత కఠినం చేయనున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. అదే విధంగా జిల్లాలోని ఏపూరు, తిరుమలగిరి ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా గుర్తించారు.
మిర్యాలగూడలో మరో పాజిటివ్
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ మిర్యాలగూడ పట్టణంలో మరో పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. మర్కజ్ నుంచి సూర్యాపేటకు వచ్చిన వ్యక్తిని కలిసిన ఈదులగూడకు చెందిన మహిళకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సదరు మహిళకు చెందిన కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఆరుగురిని నల్గొండకు క్వారంటైన్ కు పంపారు.