- ఒక్కరోజే 32 వేల దరఖాస్తులు
- అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 6,084
- సర్కారుకు అప్లికేషన్లతోనే రూ.1,208 కోట్ల ఆదాయం
- 20న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వైన్స్ కొత్త లైసెన్సుల కోసం 63 వేల దాకా అప్లికేషన్లు వచ్చాయి. వీటి ద్వారా సర్కారుకు ఏకంగా రూ.1,208 కోట్ల ఆదాయం వచ్చింది. చివరిరోజైన గురువారం ఒక్కరోజే 32,196 దరఖాస్తులు రావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న వైన్స్ లైసెన్స్ పీరియడ్ ఈ నెలాఖరుతో ముగియనుంది. వచ్చే నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో వైన్స్ లైసెన్సుల కోసం ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆబ్కారీ ఆఫీసుల్లో అప్లికేషన్లు స్వీకరించారు. ఒక్కో అప్లికేషన్కు రూ.రెండు లక్షలను నాన్ రీఫండబుల్ ఫీజుగా నిర్ణయించారు. ఈ ఏడాది కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 2,620 వైన్స్ ఉండగా, గురువారం రాత్రి 8 గంటల దాకా 62,886 దరఖాస్తులు అందాయి. యావరేజ్గా ఒక్క షాప్ కోసం 24 అప్లికేషన్లు అందాయి. గతంలో 49 వేల అప్లికేషన్లు రాగా.. ఇప్పుడు మరో 13 వేలు పెరగడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 6,084 అప్లికేషన్లు వచ్చాయి. ఈ జిల్లాల్లో సగటున ఒక్కో షాపునకు 48 అప్లికేషన్లు అందాయి. ఇక అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 556 అందాయి. ఈ నెల 20న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు.