- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: కరోనా కష్టాల నుంచి రాష్ట్రంలోని వలస కార్మికులను గట్టెక్కించేందుకు కేంద్రం ఇప్పటి వరకు రూ.330 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలోని వలస కార్మికుల సంక్షేమంపై పార్లమెంట్లో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి రాతపూర్వక సమాధానమిచ్చారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద రాష్ట్రంలోని 1.84 లక్షల మంది వలస కార్మికులకు రూ.102.66 కోట్లు, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 1. 73 లక్షల మందికి రూ.102. 69 కోట్లు ఖర్చు చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మరో రూ.124.55 కోట్లు రిలీజ్ చేసిందని, 8.30 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందారని చెప్పారు. మొత్తం రూ.329.90 కోట్లు రాష్ట్రంలోని వలస కార్మికులకు కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు.