
- ఎయిర్ ఇండియా, ఇండిగో స్పెషల్ ఫ్లైట్లలో బంగ్లాదేశ్ నుంచి రాక
- హైకమిషన్ సిబ్బందిని కూడా ఢిల్లీకి రప్పించిన కేంద్రం
- ఢాకాకు ప్రారంభమైన రెగ్యులర్ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో ఉంటున్న మనోళ్లలో 400 మందికి పైగా తిరిగి వచ్చారు. ఎయిర్ ఇండియా, ఇండిగో స్పెషల్ ఫ్లైట్లలో వాళ్లు ఇండియాకు చేరుకున్నారు. ‘‘ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ మంగళవారం రాత్రి బంగ్లాదేశ్ లోని ఢాకాకు వెళ్లింది. 205 మంది ప్రయాణికులను తీసుకుని బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీరిలో 199 మంది పెద్దవాళ్లు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు” అని అధికారులు తెలిపారు. అలాగే ఇండిగో స్పెషల్ ఫ్లైట్ ఢాకా నుంచి కోల్ కతాకు 200 మందికి పైగా ప్రయాణికులను తీసుకొచ్చిందని చెప్పారు.
మరోవైపు ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ నుంచి 190 మంది నాన్ ఎస్సెన్షియల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. వాళ్లను ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ లో 20–30 మంది సీనియర్ సిబ్బంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఢాకాకు తమ రెగ్యులర్ సర్వీసులను ప్రారంభించామని ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా ఎయిర్ లైన్ కంపెనీలు ప్రకటించాయి. బంగ్లా పరిస్థితే భారత్ లోనూ రావచ్చన్న ఖుర్షిద్.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్ లోనూ రావొచ్చని కాంగ్రెస్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ కామెంట్ చేశారు. ‘‘కాశ్మీర్ లో అంతా బాగున్నట్టే కనిపించొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నట్టే ఇక్కడ కూడా ఆందోళనలు జరగొచ్చు” అని ఆయన అన్నారు.
కాగా, సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ దేశంలో అరాచకాన్ని కోరుకుంటున్నదని ఫైర్ అయ్యారు. మరోవైపు బంగ్లాదేశ్ సంక్షోభం ప్రతి డిక్టేటర్ కు ఓ గుణపాఠం లాంటిదని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పాలనే బలమైన భావన బంగ్లాదేశ్ లో ఉన్నది. షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి రాకుంటే, ఆమెను కూడా చంపేసేవారు” అని అన్నారు.
మరికొన్ని రోజులు ఢిల్లీలోనే షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొన్ని రోజులు ఢిల్లీలోనే ఉంటారని ఆమె కొడుకు సాజిబ్ వాజేద్ తెలిపారు. జర్మనీ మీడియాకు ఆయన బుధవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. హసీనా వేరే దేశంలో ఆశ్రయం పొందేందుకు ప్లాన్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అవన్నీ పుకార్లు. మా అమ్మ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమె కొన్ని రోజులు ఢిల్లీలోనే ఉంటుంది. మా సిస్టర్ కూడా అమ్మతోనే ఉంది” అని వాజేద్ చెప్పారు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.
హిందువులపై దాడులు.. సనాతన ధర్మానికి ముప్పు: యోగి
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మన పొరుగు దేశం మండిపోతున్నది. అక్కడ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. హిందువులపై దాడులు చేస్తున్నారు. మనం గత చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే, భవిష్యత్తు కూడా ఉండదు. సనాతన ధర్మానికి ముప్పు పొంచి ఉన్నది. అందరం ఏకమై దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు. కాగా, బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని బుధవారం జమ్మూలో రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేశారు.