
వాషింగ్టన్: ప్రపంచం చుట్టూ కొమ్ముల కంచె వేసేస్తోంది కరోనా మహమ్మారి. ఎన్ని చేస్తున్నా కంట్రోల్లోకి రాకుండా మొండిఘటంలా మారుతోంది. లాక్డౌన్లు పెట్టినా, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నా, చేతులు శుభ్రంగా కడుగుతున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు 41 లక్ష దాటిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ‘మిలియన్’ మార్కును అందుకోవడానికి చాలా తక్కువ టైం తీసుకుంటోంది. ఇప్పటిదాకా మొత్తం 4,100,609 మంది దాని బారిన పడ్డారు. 2,80,431 మంది చనిపోయారు. 14,39,842 మంది కోలుకున్నారు.
11 రోజుల్లోనే..
ఫస్ట్ కేసు డిసెంబర్ 19న రిపోర్ట్ అయిందనుకుంటే.. అక్కడి నుంచి ఫస్ట్ పది లక్షల కేసులు నమోదవడానికి పట్టిన టైం 106 రోజులు. అంటే మూడు నెలలకుపైనే. కానీ, అక్కడి నుంచి సీన్ రివర్స్ అయిపోయింది. చాలా స్పీడ్గా కేసులు పెరిగాయి. రెండో మిలియన్ కేసులు నమోదవడానికి పట్టిన టైం 12 రోజులు. మూడో మిలియన్కు 13 రోజులు పట్టింది. నాలుగో మిలియన్ కేసులు నమోదవడానికి తీసుకున్న టైం జస్ట్ 11 రోజులే. ఇలాంటి టైంలోనే కొన్ని దేశాలు లాక్డౌన్ను ఎత్తేశాయి. మరికొన్ని ఎత్తేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సిచువేషన్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. కేసులు స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా రోజూ సగటున 28,423 కేసులు నమోదయ్యాయి. కానీ, ఫస్ట్ మిలియన్ దాటిన తర్వాతి నుంచి లెక్కలు తీస్తే.. 36 రోజుల్లో సగటున రోజూ 84,616 కేసుల చొప్పున 30,46,178 కేసులు రికార్డయ్యాయి.
వలసొచ్చినోళ్లపై ఎఫెక్ట్
కరోనా కేసులు పెరుగుతున్నా స్వీడన్ మాత్రం లాక్డౌన్ పెట్టలేదు. జనాన్ని వదిలేసింది. దీంతో అక్కడ ఇప్పుడు 25,921 కేసులు నమోదయ్యాయి. 3,220 మంది చనిపోయారు. అక్కడ మరణాల రేటు 12.42 శాతంగా ఉంది. అయితే, అందులో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మాత్రం పొట్టచేతబట్టుకుని వలస వెళ్లినవాళ్లే. సోమాలియా, ఇరాక్కు చెందిన చాలా మంది కరోనాకు బాధితులయ్యారు. మొత్తం కేసుల్లో 5% మంది సోమాలీలు కరోనా బారిన పడ్డారు. ఇరాక్ నుంచి వచ్చినోళ్లలోనూ వందల సంఖ్యలో బాధితులున్నారు. వాళ్లంతా జనం ఎక్కువగా ఉండే చోట నివసించడం, ఇరుకిరుకు ఇళ్లలో బతుకుతుండడం, సరైన వసతుల్లేకపోవడం వంటి కారణాల వల్లే వాళ్లు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నట్టు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ఫిన్లాంఢ్లోని హెల్సింకిలోనూ ఇదే పరిస్థితి ఉంది. దేశ రాజధానిలోని మొత్తం కేసుల్లో 14 శాతం వాళ్లే ఉన్నారు. నార్వేలోనూ 25% మంది ఇమిగ్రెంట్స్ కరోనా బారిన పడ్డారు. వెంటనే స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి అన్న మాటలు వినిపిస్తున్నాయి.
చైనా సోషలిస్ట్ సిస్టమ్ వల్లే అదుపులోకి
కరోనాకు కారణమన్న అపవాదును చైనా మూటగట్టుకుంటుంది చైనా. చాలా దేశాలు డ్రాగన్ కంట్రీవైపే వేలెత్తి చూపించాయి. అయితే, చైనా సర్కార్ మాత్రం తమను తాము పొగిడేసుకుంది. దేశంలోని సోషలిస్ట్ రాజకీయ వ్యవస్థ వల్లే కరోనాపై గెలిచామని ప్రెసిడెంట్ షి జిన్పింగ్ అన్నారు. ఇదే కాకుండా ఏ సవాళ్లనైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ), సోషలిస్ట్ సిస్టమ్ ఎదుర్కోగలదని కరోనా విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఎంతో కష్టపడితేగానీ ఈ విజయం దక్కలేదన్నారు. కరోనా వ్యాప్తిని ఒక్క నెలలోనే తగ్గించామని, రెండు నెలల్లో కేసులను సింగిల్ డిజిట్కు తీసుకొచ్చామని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇదో పెద్ద విజయమేనని అన్నారు. దేశంలో శనివారం కేవలం ఒకే ఒక్క కేసు నమోదైంది. మొత్తం కేసుల సంఖ్య 82,887కు చేరింది. మొత్తం 4,633 మంది చనిపోయారు. శనివారం డెత్లు
నమోదు కాలేదు.
యూరప్ సిద్ధం కాలే
కరోనాతో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ప్రాంతం యూరప్. ఆ ఖండంలోని దేశాలన్నీ కరోనా బారిన పడ్డాయి. బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశాలూ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. దాదాపు 45 శాతం మరణాలు ఈ ఆరు దేశాల్లోనే నమోదయ్యాయి. అయితే, కరోనాను ఎదుర్కొనేందుకు యూరప్ సరిగ్గా సిద్ధం కాలేదని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ అన్నారు.
సౌత్ కొరియాలో నైట్క్లబ్లు బంద్
కేసులు తగ్గాయనుకున్న టైంలో సౌత్కొరియాకు నైట్క్లబ్ల రూపంలో ముప్పు వచ్చి పడింది. 2,100కు పైగా కేసులు నైట్క్లబ్బులు, బార్లు, డిస్కోల వల్లే వచ్చాయి. దీంతో వాటన్నింటినీ బంద్ పెట్టేసింది సౌత్కొరియా సర్కార్. దేశంలోని అన్ని ఎంటర్టైన్మెంట్ హబ్బులను మూసేయాల్సిందిగా సర్కార్ ఆదేశించింది. ప్రస్తుతం అక్కడ 10,840 కేసులు నమోదు కాగా 256 మంది చనిపోయారు.