అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తనకల్లు, నల్లచెర్వు మండలాల దగ్గరలోని 42వ నేషనల్ హైవేపై మినీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
కుక్కంటి క్రాస్ నుంచి ప్రయాణికులతో కదిరికి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుల్లో చాలా వరకు తనకల్లు మండలానికి చెందిన వారుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న తనకల్లు ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.