
వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి పట్టణంలోని పోచమ్మగుడి వద్ద ఆదివారం 15, 16వ శతాబ్దం నాటి వీరగల్లులు, విలుగాండ్రైన వీరులస్మారక శిలలను, సతి శిలలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు గుర్తించారు. ఈ సందర్భంగా పరిశోధకులు బైరోజు చంద్రశేఖర్, బైరోజు శ్యాంసుందర్ మాట్లాడుతూ.. వీరశిలల్లో తొమ్మిది మంది విలుగాళ్లు, ఒక అశ్వారూఢుడైన వీరుడు బల్లెంతో, మరొక వీరుడు బల్లెం, డాలుతో కనిపిస్తున్నారని తెలిపారు.
ఈ వీర శిలలలో స్త్రీలు, వారి పక్కన సతిశిలలు కనిపించాయన్నారు. విలుగాళ్లలో కత్తి కూడా ఆయుధంగా ధరించిన ఎక్కటీలు ఇద్దరు ఉండడం ప్రత్యేకతగా చెప్పారు. ఇంత మంది వీరుల స్మారకశిలలు ఒకేచోట ఉండడాన్ని బట్టి చూస్తే వనపర్తి జిల్లా ఒకనాటి యుద్ధరంగమై ఉంటుందని పేర్కొన్నారు. వీరారాధన క్రీస్తుకు పూర్వం నుంచి ఉందని, వీరగల్లులో నలబై రకాలు ఉన్నాయని, శాసనంతో కూడిన వీరగల్లులు వాటిలో ప్రత్యేకమని వారు తెలిపారు.