
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. పది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879, బుధవారం 891, గురువారం 920 కేసులు నమోదుకాగా.. శుక్రవారం ఏకంగా 985 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లోనే 774 కేసులు నమోదైనట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రంగారెడ్డిలో 86, మేడ్చల్ లో 53, వరంగల్ అర్బన్ 20, మెదక్ 9, ఆదిలాబాద్ 7, సిరిసిల్ల, నాగర్కర్నూల్, నిజామాబాద్లలో 6 చొప్పున, సిద్దిపేట, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, ములుగు, జగిత్యాల, భువనగిరిల్లో 2 చొప్పున, వికారాబాద్, మహబూబ్నగర్, మిర్యాలగూడల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కు పెరిగింది. ఇందులో 4,766 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 7,436కు పెరిగింది. కరోనాతో శుక్రవారం మరో ఏడుగురు చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. వీటితో కలిపి మరణాల సంఖ్య 237కు పెరిగినట్టు పేర్కొంది.
ఢిల్లీకి చేరువైనం..
రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్ రేట్ రోజు రోజుకూ పెరుగుతోంది. టెస్ట్ చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి వైరస్ ఉన్నట్టు తేలుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 4,374 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇందులో 22.5 శాతం మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. మొత్తం టెస్టుల సంఖ్య 75,308కి పెరిగింది. టెస్టుల పాజిటివ్ రేటు 16.39 శాతానికి పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర 17.52 శాతం, ఢిల్లీలో 16.8 శాతం పాజిటివ్ రేట్ ఉంది. కొద్దిరోజుల్లోనే ఈ రెండు రాష్ట్రాలను తెలంగాణ దాటిపోయే అవకాశం ఉందని ఎక్స్పర్టులు అంటున్నారు.
11 మంది ట్రైనీ కానిస్టేబుల్స్కి కరోనా
కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ బెటాలియన్లోని 11 మంది ట్రైనీ కానిస్టేబుల్స్కి వైరస్ సోకింది. ఏఆర్ వింగ్లో ట్రైనింగ్ పొందుతున్న కానిస్టేబుల్స్ నుంచి బుధవారం 50 శాంపిల్స్ తీసుకున్నారు. శుక్రవారం ఇందులో 11 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ కానిస్టేబుల్స్ను ఎర్రగడ్డ నేచర్ క్యూర్, ఆయుర్వేద్ హస్పిటల్స్కి తరలించారు. శనివారం మరికొందరి రిపోర్టులు రానున్నాయి.
ధనిక రాష్ట్రమే కానీ..అప్పు 2.90 లక్షల కోట్లు