
శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ఆదిత్య హాసన్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘90స్’ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్లైన్. నవీన్ మేడారం సమర్పణలో రాజశేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో శుక్రవారం టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అతిథిగా హాజరైన ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీస్లో జీవితం ఉంది. మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరీస్ ఇది. సంక్రాంతికి థియేటర్స్లోనే కాదు ఓటీటీలు కూడా హిట్స్ ఇస్తాయనడానికి ఇదే నిదర్శనం’ అని అన్నారు. శివాజీ మాట్లాడుతూ ‘ఒక్క ఎపిసోడ్ విన్నా ఓకే చేసే కథ ఇది. అంత బావుంది. నేను చేసిన ‘మిస్సమ్మ’ ఇప్పటికీ ఇండియన్ టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇవాళ ఇండియన్ ఓటీటీలో టాప్5 లో ఉండటానికి అన్ని క్వాలిటీస్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్తో ఐదు లక్షల సబ్ స్క్రైబర్స్ రావడం మామూలు విషయం కాదు. ఆదిత్య అద్భుతంగా రాశాడు. ఈ సక్సెస్ క్రెడిట్ తనదే. ఇది నా కెరీర్లో మెమొరబుల్గా నిలిచిపోతుంది. దీన్ని సినిమాలా కూడా విడుదల చేస్తారని అనుకుంటున్నా’ అని చెప్పాడు. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని ముందుగానే నమ్మాను అని చెప్పింది వాసుకి. ‘90స్ కిడ్స్ దీన్ని చాలా వోన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అన్నాడు దర్శకుడు ఆదిత్య. టీమ్ అంతా పాల్గొన్నారు.