- ఊపందుకోనున్న బ్యాటరీల తయారీ
బిజినెస్ డెస్క్, వెలుగు: ఒకప్పుడు గోల్డ్, తర్వాత క్రూడాయిల్.. తాజాగా లిథియం. ఒక దేశ ఆర్థిక పరిస్థితిని మార్చే సత్తా ఈ ఖనిజానికి ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ జపం చేస్తున్నాయి. ఈ వెహికల్స్ బ్యాటరీలను లిథియంతోనే తయారు చేస్తారు. కేవలం ఈవీ ఇండస్ట్రీనే కాదు ఎనర్జీ (కరెంట్) స్టోర్ చేయాలనుకునే ప్రతీ సెక్టార్లో అడ్వాన్స్డ్ బ్యాటరీ సెల్స్ అవసరం. వీటిని తయారు చేయాలంటే లిథియం కచ్చితంగా కావాల్సిందే.
తాజాగా పెద్ద మొత్తంలో లిథియం గనులు బయటపడడం దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ కంపెనీలు, మీడియా, సోషల్ మీడియా, ప్రజల చర్చల్లో లిథియం మాట మార్మోగిపోతోంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో లిథియం నిల్వలను గుర్తించినట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 5.9 మిలియన్ టన్నుల నిల్వలు గుర్తించినట్టు పేర్కొంది. ప్రస్తుత ధర దగ్గర ఈ నిల్వల విలువ ఏకంగా 34 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. మన జీడీపీ వాల్యూ 3.5 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ . లిథియం గనులను గుర్తించడంతో ప్రపంచ ఈవీ మార్కెట్లో ఇండియా స్థాయి మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్కు హబ్గా మారుతుందని, చైనాపైన ఆధారపడడం తగ్గిపోతుందని అంచనాలు ఎక్కువయ్యాయి.
ఆరో ప్లేస్లో ఇండియా
ప్రపంచంలో లిథియం నిల్వలున్న దేశాల్లో ఇండియా ఆరో ప్లేస్కు చేరుకుంది. 21 మిలియన్ టన్నులతో బొలీవియా, 17 మిలియన్ టన్నులతో అర్జెంటీనా, 9 మిలియన్ టన్నులతో చిలీ, 6.8 మిలియన్ టన్నులతో యూఎస్, 6.3 మిలియన్ టన్నులతో ఆస్ట్రేలియా మనకంటే ముందున్నాయి. 4.5 మిలియన్ టన్నులతో చైనా మన తర్వాత ప్లేస్లో ఉంది. గ్లోబల్గా 98 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) లిథియం నిల్వలు ఉంటాయని అంచనా వేయగా, ఇందులో 26 ఎంఎంటీ రిజర్వ్లను ఇప్పటి వరకు గుర్తించారు. రిసోర్స్, రిజర్వ్ మధ్య తేడాని గమనించాలి. ప్రాధమిక సర్వే చేశాక వేసిన అంచనాలను రిసోర్స్లుగా పరిగణిస్తున్నారు. రిజర్వ్ అంటే బయటకు తీయగలిగే ఖనిజం. ఇండియాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం రిసోర్స్లను గుర్తించారు. బయటకు తీసే ఖనిజం ఇంకా తక్కువగా ఉండొచ్చు.
ఈ కంపెనీల షేర్లు మల్టీబ్యాగర్లుగా?
మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకోసిస్టమ్ లిథియంపై ఆధారపడి ఉంది. ఈ ఖనిజ నిల్వలు గుర్తించడంతో దేశ ఈవీ సెక్టార్ లాభపడనుంది. ముందుగా మైనింగ్ కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. కానీ, లిథియం ఎక్కువగా రియాక్ట్ అయ్యే మెటల్. అందువలన ఈ మెటల్ను బయటకు తీయడం అంత ఈజీ పనేమి కాదు. లేబర్ రూల్స్, ఎన్విరాన్మెంటల్ చట్టాలు కఠినంగా ఉంటాయి. లిథియం ఫైనల్ ప్రొడక్ట్ను బయటకు తీసి, బ్యాటరీ సెల్స్గా మార్చే టెక్నాలజీ ఇండియాలో ప్రస్తుతానికైతే లేదు. అడ్వాన్స్డ్ సెల్ బ్యాటరీల కోసం చైనాపై ఆధారపడుతున్నాం. ఇన్వెస్టర్లు ఈవీ ఎకోసిస్టమ్లోని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మైనింగ్ కంపెనీలపై మొదట దృష్టి పెట్టాలి. వీటితో పాటు లిథియం కొనే కంపెనీలపై ఫోకస్ పెట్టాలి. దేశంలో బ్యాటరీ తయారీ కంపెనీలకు హెచ్ఈజీ ఆనోడ్లను సప్లయ్ చేస్తోంది. నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి ముందుకొచ్చాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హీరో సబ్సిడరీ ఏథర్ ఎనర్జీ వంటివి బ్యాటరీ అసెంబ్లింగ్లో ఉన్నాయి. రిలయన్స్ న్యూ ఎనర్జీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీలు బ్యాటరీలను తయారు చేయడానికి పీఎల్ఐ కింద అనుమతులు పొందాయి. మోటార్ పవర్ ట్రెయిన్లు, ఎలక్ట్రానిక్స్ను బాష్, ఏబీబీ వంటి కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈవీలకు సాఫ్ట్వేర్ను టాటా ఎలెక్సీ, కేపీఐటీ టెక్నాలజీ వంటి కంపెనీలు అందిస్తున్నాయి. టాటా మోటార్స్ ఈవీ బిజినెస్లో వేగంగా విస్తరిస్తోంది. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి కంపెనీలూ భారీగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యాయి. ఎక్సైడ్, అమర రాజా, ఓలెక్ట్రా గ్రీన్టెక్, కబ్రా ఎక్స్ట్రుషన్ టెక్నిక్, మిండా కార్ప్, సోనా కామ్స్టర్, జేబీఎం ఆటో, ఫియామ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఈవీ ఎకోసిస్టమ్లో దూసుకుపోవాలని చూస్తున్నాయి.
మైనింగ్ ఎప్పుడు?
లిథియం మైనింగ్ స్టార్ట్ కావడానికి కనీసం 3 ఏడేళ్ల టైమ్ అయినా పట్టొచ్చు. యునైటెడ్ నేషన్స్ స్టాండర్డ్స్ ప్రకారం, నాలుగు దశల్లో మైనింగ్ చేపడతారు. ఎక్కడ రిజర్వ్లు ఉన్నాయనే ప్రిలిమినరీ వర్క్ను జీ4 కింద చేపడతారు. జీ3 కింద మైనింగ్ ఏరియాను గుర్తిస్తారు. తాజాగా గుర్తించిన లిథియం నిల్వలు జీ3 స్టేజ్లో ఉన్నాయి. జీ2 లో మైనింగ్ చేయగలిగే ఏరియాను మరింతగా కుదిస్తారు. జీ1 కింద క్షుణ్ణంగా నివేదిక పంపి, మైనింగ్ చేయడం వలన లాభమో? కాదో ? విశ్లేషిస్తారు.
ఆ తర్వాత కంపెనీలకు లీజుకిస్తారు.