పాట్నా: బిహార్లోని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో రైలు పనుల్లో భాగమైన ఓ క్రేన్ను ప్యాసింజర్లతో కూడిన ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఒక చిన్నారి, ఒక మహిళ ఉన్నారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాట్నాలోని రామ్లఖన్ పాత్ ప్రాంతంలో మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగమైన భారీ క్రేన్ను ఆటో అదుపుతప్పి ఢీ కొట్టిందని పోలీసులు వెల్లడించారు.
ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు పాట్నా సెంట్రల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారని వివరించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు రిలీజ్ చేశారు. అందులో క్రేన్ను ఆటో ఢీకొట్టిన విజువల్స్ క్లియర్ గా రికార్డ్ అయ్యాయి.